Begin typing your search above and press return to search.

ఆమె ప్రజాస్వామ్య పిపాస.. కారాగారంలోనే బందీ

By:  Tupaki Desk   |   6 Dec 2021 12:30 PM GMT
ఆమె ప్రజాస్వామ్య పిపాస.. కారాగారంలోనే బందీ
X
అంగ్ సాన్ సూకీ.. 76 ఏళ్ల ఈ ప్రజాస్వామ్య పిపాసి... మహాత్మాగాంధీ స్పూర్తితో.. బుద్ధుడి బోధనల ప్రేరణతో.. తమ దేశంలో ప్రజాస్వామ్య పునాదులు వేసేందుకు జీవితాంతం పరితపించిన నేత. ఆ క్రమంలో నిర్బంధాలు.. జైలు జీవితం. ఎన్నోకష్టాలు మరెన్నో నష్టాలు. జీవిత చరమాంకలో ఉన్న ఆమె ఇప్పుడు మరో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. మిలటరీకి వ్యతిరేకంగా అసమ్మతిని ప్రేరేపించినందుకు, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సూకీకి ఈ శిక్ష వేసింది మయన్మార్ కోర్టు.

సూకీకి ‘‘సెక్షన్ 505(బి) కింద రెండేళ్లు, ప్రకృతి విపత్తు చట్టం ప్రకారం మరో రెండేళ్ల జైలుశిక్ష కోర్టు విధించింది.’’అని ప్రతినిధి జా మిన్ తున్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టిన సైన్యం.. సూకీ సహా పలువురు కీలక నేతలను పట్టుకుని వారిపై విచారణ చేపడుతోంది.

జీవితమే జైలు

ఒకటి కాదు రెండు కాదు 21 ఏళ్లలో 15 ఏళ్లపైగా అయితే జైలు లేదంటే ఇంట్లో నిర్బంధం. ఎప్పుడో 1990 లోనే 81 శాతం ఓట్లతో అఖండ ప్రజామోదం పొందిన ఓ నాయకురాలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనాల్సి వస్తుందని ఎవరైనా అనుకుంటారా? అంతా బాగుంటే ఆమె ఈపాటికి ప్రపంచ నాయకురాలిగా ఎదిగేవారు. కానీ, మయన్మార్ క్రూర మిలటరీ ఆ అవకాశం ఇవ్వలేదు. ప్రజాస్వామ్య వాసనే గిట్టని మిలటరీ.. సూకీ గొంతును ఎప్పటికప్పుడు నొక్కేసింది.

1990 ఎన్నికల్లో ఆమె గెలవబోతున్నారని తెలిసి 1989లోనే నిర్బంధంలోకి తీసుకుంది. అనంతరం ఆమె పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ సాధించిన అద్వితీయ ఆధిక్యాన్ని మిలటరీ తన ఉక్కు పాదాల కింద తొక్కిపెట్టింది. 1990 -2010 మధ్యలో ఆరేళ్ల కాలమే ఆమె బయటి ప్రపంచాన్ని చూశారు. మళ్లీ ఇప్పుడు 76 ఏళ్ల వయసులో నాలుగేళ్ల శిక్షను ఎదుర్కొననున్నారు.

ప్రజాస్వామ్యం పీక నొక్కి

మయన్మార్ మిలటరీ జుంటాకు ప్రజాస్వామ్యం అంటే పరమ కంపరం. కానీ, సూకీకి ప్రజాస్వామ్యమే ప్రాణ వాయువు. అదే ఆమెపై జీవిత కాల కక్షకు కారణమైంది. వయసు మీద పడుతున్నా తన ఆశయంపై వెనక్కుతగ్గని సూకీని మిలటరీ అనేక రకాలుగా వేధించింది. 2003లో ఆమెపై హత్యాయత్నం వెనుక కూడా అనుమానాలున్నాయి. నాటి ఘటనలతో సూకీ త్రుటిలో తప్పించుకున్నారు. 70మంది పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు.

అయినా,పోరాటాన్ని కొనసాగించిన సూకీ, 2010 లో పాక్సిక ప్రజాస్వామ్యం సాధించి తన కల కొంతైనా నెరవేర్చుకోగలిగారు. కానీ, సూకీ దేశ పగ్గాలు చేపట్టకుండా మిలటరీ కుటిల యత్నాలతో ఆమెను పదవికి దూరం చేసింది. విదేశీయుడిని వివాహం చేసుకుందన్న కారణాన్ని చూపుతూ సూకీ మియన్మార్ అధ్యక్షురాలు కాకుండా మిలటరీ నిబంధన తెచ్చి అడ్డుకుంది. దీంతో సూకీ కోసం స్టేట్ కౌన్సిలర్ పదవిని క్రియేట్ చేశారు. ఇది దాదాపు ప్రధాన మంత్రి లేదా ప్రభుత్వాధినేత పదవికి సమానం.

పదేళ్ల పదవీ కాలం.. అందులోనూ ఆరోపణలు

సుదీర్ఘ పోరాటం తర్వాత పదవి దక్కిన సూకీ 2010 నుంచి 2021 వరకు పనిచేశారు. అయితే, ఈ కాలంలో ఆమె కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రోహింగ్యా ముస్లింల ఊచకోతలో ప్రపంచ దేశాలు సూకీ తీరును తప్పుబట్టాయి. మిలటరీనే ఆ హత్యాకాండకు పాల్పడిందన్న వాస్తవాన్నిఅంగీకరించకపోవడం మరింత వివాదాస్పదమైంది.

శాంతి దూతగా పేరుండీ..నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన సూకీ అధికారంలో ఉండగా ఇలాంటివి జరగడాన్ని తప్పుబట్టాయి. 2019లో జర్నలిస్టులను ప్రాసిక్యూట్ చేయడం కూడా వివాదాస్పదమైంది. రోహింగ్యాల ఊచకోతపై సైన్యాన్ని వెనకేసుకొచ్చిన సూకీ.. ఇందుకు అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్ కూడా ఎదుర్కొన్నారు.

చివరకు అదే సైన్యం ఆమెను ఏడాది తిరగకుండానే పదవి నుంచి దింపేసింది. 2012, 2015 ఎన్నికల్లో సూకీ పార్టీ గెలుపును అంగీకరించిన సైన్యం 2020 నవంబరులో జరిగిన ఎన్నికల్లో గెలుపును మాత్రం ఒప్పుకోలేదు. ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సూకీ పార్టీ విజయాన్ని తోసిపుచ్చింది.

దీనిపై ఆందోళనలు చెలరేగినా యథావిధిగా ఉక్కుపాదంతో అణచివేసింది. ఇప్పడు సూకీ సహా మాజీ అధ్యక్షుడు విన్ మైంట్ కు నాలుగేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వయసు రీత్యా చూస్తే సూకీ మరెంతో కాలం పోరాడలేరని తెలిసిపోతోంది. అంటే.. ఆమె ప్రజాస్వామ్య పోరాటం పాక్షిక విజయంతోనే ముగిసినట్టుగా భావించాలి.