Begin typing your search above and press return to search.

ఆ ఐటీ ఇంజనీర్ ఎంత మందికి అంటించి ఉంటాడు?

By:  Tupaki Desk   |   3 March 2020 4:50 AM GMT
ఆ ఐటీ ఇంజనీర్ ఎంత మందికి అంటించి ఉంటాడు?
X
కొవిడ్ 19 (కరోనా) పాజిటివ్ కేసు హైదరాబాద్ లో కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటివరకూ దేశంలో వెలుగు చూసిన కేసులకు భిన్నమైనది హైదరాబాద్ ఐటీ ఉద్యోగి ఉదంతం. ఆఫీసు పని మీద హాంకాంగ్ వెళ్లి ఆ తర్వాత దుబాయ్ మీదుగా బెంగళూరు కు వచ్చిన ఆ యువకుడు ప్రైవేటు బస్సు లో హైదరాబాద్ కు వచ్చాడు. ఈ సందర్భంగా అతగాడికి కాస్త దగ్గరగా ఉన్నోళ్లు 80 మందికి పైనే అని లెక్కలేశారు.ఇప్పుడా 80 మందిని గుర్తించి.. వారిలో కొవిడ్ వైరస్ ఎంతమేర ఉందన్న పరీక్షల్ని నిర్వహించాల్సి ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఐటీ ఉద్యోగికి కాస్త దగ్గరగా ఉన్న 80 మంది.. ఎంత మందికి దగ్గరగా ఉన్నారు? వారెవరు? ఎక్కడెక్కడ ఉన్నారు? అన్నది అతి పెద్ద ప్రశ్న.

ఏసీ బస్సులో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు.. మిత్రులు.. బంధువులతో సన్నిహితంగా ఉండటం.. వారెంతమంది ఉంటారన్నది మరో ప్రశ్న. ఇప్పటికి 11 మందిని గుర్తించిన అధికారులు వారి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొవిడ్ వైరస్ పాజిటివ్ అని తేలటానికి ముందు సదరు ఐటీ ఉద్యోగి సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లటం.. అతనికి చికిత్స చేయటంతో పాటు.. వైద్య సాయం చేసిన సిబ్బందిలో ఎంతమందికి కొవిడ్ వైరస్ బదిలీ అయి ఉంటుందన్నది ఒక ప్రశ్న అయితే.. వారి ద్వారా వేరే వారికి వ్యాపించే అవకాశం ఎంతమేర ఉందన్న విషయాన్ని ఆలోచిస్తుంటేనే గుండెలు దడదడమని కొట్టుకునే పరిస్థితి.

కొవిడ్ వైరస్ సోకిన వ్యక్తి మరో వ్యక్తికి దగ్గరగా ఉండటం తో ( సెకండ్ పర్సన్ ) వైరస్ ప్రవేశించే అవకాశం ఉంది. ఆ సెకండ్ పర్సన్ నుంచి థర్డ్ పర్సన్ లోకి వైరస్ వెళ్లటం మొదలైతే మాత్రం నిలువరించటం అంత తేలికైన విషయం కాదన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి.. వైద్య ఆరోగ్య శాఖకు ఇప్పడిదే అంశం పెద్ద టెన్షన్ గా మారింది. మొత్తంగా కొవిడ్ పాజిటివ్ ఉన్న ఐటీ ఉద్యోగి ఎంతమందికి తన వైరస్ ను అంటించి ఉంటాడన్న విషయం పెద్ద ప్రశ్నగా మారింది. ఆ విషయం తేలే లోపు కొవిడ్ వైరస్ మరెంతమందికి వ్యాపిస్తుందన్నది బిలియన్ డాలర్ల క్వశ్చన్.