Begin typing your search above and press return to search.

బ్రెజిల్ కోవాగ్జిన్ స్కాం.. స్పందించిన భారత్ బయోటెక్

By:  Tupaki Desk   |   1 July 2021 2:30 AM GMT
బ్రెజిల్ కోవాగ్జిన్ స్కాం.. స్పందించిన భారత్ బయోటెక్
X
కరోనా కల్లోలంలోనూ క్యాష్ చేసుకునే కక్కుర్తి దేశాధినేతలు ఉన్నారంటే వాళ్లను ఏమనాలి? శవాలపై పైసలు ఏరుకునేలా... కరోనా వ్యాక్సిన్లపై కూడా స్కాం చేసి దండుకుంటున్న దగాకోరు రాజకీయ నేతలు మన ప్రపంచంలోనే ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.. ప్రస్తుతం బ్రెజిల్ లో టీకా స్కాం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

-బ్రెజిల్ లో స్కాం ఏంటి?
బ్రెజిల్ దేశంలో టీకాల పంపిణీకి భారత్ బయోటెక్ గతంలో ఒప్పందం చేసుకుంది. బ్రెజిల్ కూడా ఈ డీల్ సెట్ చేసుకుంది. కానీ భారత్ సెకండ్ వేవ్ తో టీకాల పంపిణీని బ్రెజిల్ కు చేయలేకపోయింది భారత్ బయోటెక్ కంపెనీ. తాజాగా బ్రెజిల్ దేశంలో 'కోవాగ్జిన్' స్కామ్ బయటపడిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అధిక ధరకు కోవాగ్జిన్ కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తలతో బ్రెజిల్ దేశ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో చిక్కుల్లో పడ్డారు. కోవాగ్జిన్ టీకాలను కొనుగోలు చేసేందుకు ఫిబ్రవరిలో బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుంది. ఒక టీకా డోసుకు ఏకంగా 15 డాలర్లు చెల్లించడం దుమారం రేపింది. ఆ దేశంలో కోవాగ్జిన్ టీకాలను ప్రెసికా మెడికోమెంటస్ ఫార్మసీ సంస్థ సరఫరా చేయనున్నది. తొలుత రెండు కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఒక్క డోసు కూడా టీకా సరఫరా కాలేదన్న ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలోనే పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుతో కోవాగ్జిన్ కు చెందిన టీకా పరీక్షలు పూర్తికాకముందే అధిక ధరలకు ఆ టీకా కోసం ఒప్పందం కుదిరినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ డీల్ ను రద్దు చేయాలని బ్రెజిల్ పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. కోవాగ్జిన్ స్కామ్ లో తనకు ఎటువంటి పాత్ర లేదని అధ్యక్షుడు బొల్సనారో చెప్పారు.

-స్కాంపై స్పందించిన భారత్ బయోటెక్
ఈ స్కాంపై భారత్ బయోటెక్ స్పందించింది. బ్రెజిల్ నుంచి కోవాగ్జిన్ టీకాల కోసం ఎటువంటి అడ్వాన్స్ పేమెంట్ తీసుకోలేదని.. అంతేకాదు ఆదేశానికి కోవిడ్ టీకాలను కూడా సరఫరా చేయలేదని భారత్ బయోటెక్ సంస్థ పేర్కొన్నది. బ్రెజిల్ తో కోవాగ్జిన్ ప్రొక్యూర్మెంట్ తో జరిగిన ఒప్పందాన్ని భారత్ బయోటెక్ సంస్థ వివరించింది. 8 నెలల పాటు సాగిన ఒప్పంద ప్రక్రియ విధానంలో అన్ని షరతులను పాటించినట్లు చెప్పింది. జూన్ 29వ తేదీ వరకు కూడా తమకు ఎటువంటి పేమెంట్ అందలేదని భారత్ బయోటెక్ సంస్థ పేర్కొన్నది. విదేశాలకు భారత్ బయోటెక్ టీకాను 15-20 డాలర్లుగా నిర్దారించినట్టు ఆ సంస్థ వెల్లడించింది.

ఇక బ్రెజిల్ కు కూడా డోసుకు 15 డాలర్ల చొప్పున అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. డబ్బులే తీసుకోకపోవడంతో స్కాంతో తమకు సంబంధం లేదని తెలిపింది.