Begin typing your search above and press return to search.

ఆ వైసీపీ ఎంపీకి సొంత పార్టీ నేతల నుంచే తిప్పలు!

By:  Tupaki Desk   |   12 Nov 2022 3:58 AM GMT
ఆ వైసీపీ ఎంపీకి సొంత పార్టీ నేతల నుంచే తిప్పలు!
X
అన్ని పార్టీలకు అత్యంత కీలకం.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే మూడు పార్లమెంటు సీట్లు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అత్యధిక స్థానాలు ఎగరేసుకుపోయింది. మూడుకు మూడు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది.

అయితే ఈసారి వైసీపీలోనే నేతల మధ్య విభేదాలు, జనసేన, టీడీపీ బలోపేతం కావడం వంటి కారణాలతో వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పవని అంటున్నారు.

ముఖ్యంగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌కు, ఆ పార్టీ సీనియర్లకు పడటం లేదని టాక్‌ నడుస్తోంది. శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన మార్గాని భరత్‌ 2019లో తొలిసారి ఎంపీగా గెలిచారు. రాజానగరం ఎమ్మెల్యే, జిల్లాలో కీలకమైన కాపు సామాజికవర్గానికి చెందిన జక్కంపూడి రాజా, మార్గాని భరత్‌ల మధ్య మొదట్లో తీవ్ర స్థాయిలో విభేదాలు వచ్చాయి. బహిరంగంగానే సవాళ్లు విసురుకున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు.

రాజా, భరత్‌ల మధ్య గొడవను పరిష్కరించలేక వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి చేతులెత్తేశారు. దీంతో ఏకంగా ముఖ్యమంత్రి జగన్‌ వద్దే ఇద్దరి పంచాయతీ నడిచింది. సీఎం జగన్‌ ఇద్దరినీ గట్టిగా మందలించారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా జక్కంపూడి రాజాకు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.

జక్కంపూడి రాజాతో గొడవలు సద్దుమణిగాయనుకుంటే ఇప్పుడు మార్గాని భరత్‌కు, ఆ పార్టీ సీనియర్‌ నేతలు రాజ్యసభ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలతో పడటం లేదని అంటున్నారు.

మార్గాని భరత్, మంత్రి చెల్లుబోయిన వేణు, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వీరు ముగ్గురూ శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందినవారే. అయినప్పటికీ వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే టాక్‌ నడుస్తోంది.

మంత్రి వేణు వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. ఇది సహజంగానే మార్గాని భరత్‌కు ఆగ్రహం కలిగిస్తోందని చెబుతున్నారు.

మరోవైపు ఎంపీగా ఉన్న మార్గాని భరత్‌ సీనియర్లను లెక్క చేయకుండా వ్యవహరిస్తుండటం, చాలా దూకుడుగా ఉండటం, ప్రత్యేకంగా సోషల్‌ మీడియాలో తాను మాత్రమే నేతనన్నట్టు ప్రచారం చేసుకుంటుండటం వంటివి చేస్తున్నారని పిల్లి సుభాష్‌ చంద్రబోస్, చెల్లుబోయిన వేణు భావిస్తున్నారని అంటున్నారు.

వైసీపీలో మొదటి నుంచి ఉండి ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన తమ కంటే చాలా జూనియర్, యువకుడు అయిన మార్గాని భరత్‌ తమను పట్టించుకోకుండా వైసీపీలో ముఖ్య నేతగా ఎదగాలనుకోవడంపై వేణు, పిల్లి గుర్రుగా ఉన్నట్టు టాక్‌ నడుస్తోంది.

ఇప్పటికే జక్కంపూడి రాజా, మార్గాని భరత్‌ల మధ్య విభేదాలతో వైసీపీకి ఈసారి ఎన్నికల్లో గట్టి దెబ్బ తప్పదని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాజమండ్రితోపాటు రూరల్‌ నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ అత్యంత బలంగా ఉన్నాయి.

ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల మధ్య విభేదాలతో ఆ పార్టీ అధిష్టానం కలవరం చెందుతున్నట్టు తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.