Begin typing your search above and press return to search.

కేబినెట్ తీర్మానం..జ‌య‌లలిత‌కు భార‌త‌ర‌త్న‌!

By:  Tupaki Desk   |   10 Dec 2016 8:10 PM GMT
కేబినెట్ తీర్మానం..జ‌య‌లలిత‌కు భార‌త‌ర‌త్న‌!
X
దివంగత ముఖ్యమంత్రి జయలలితను ఘ‌నంగా స్మ‌రించుకునే క్ర‌మంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. జ‌య మ‌ర‌ణం అనంత‌రం ప‌ద‌వీ వార‌సుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ అన్నాడీఎంకే నేత ప‌న్నీర్ సెల్వం సార‌థ్యంలో తొలిసారి స‌మావేశ‌మైన త‌మిళ‌నాడు మంత్రివ‌ర్గం జ‌య‌లలిత‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలని తీర్మానం చేసింది. అలాగే ఎంజీఆర్ మెమోరియల్‌ను భారతరత్న డాక్టర్ ఎంజీఆర్ మరియు జయలలిత మెమోరియల్‌గా మార్చాలని తమిళనాడు కేబినెట్ తీర్మానించింది.

దీంతోపాటు ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో జయ కాంస్య విగ్రహం ఏర్పాటుపై తీర్మానం చేశారు. విగ్రహం ఏర్పాటుపై కేంద్రాన్ని కోరాలని కేబినెట్ తీర్మానం చేసింది. రూ. 15 కోట్లతో జయలలిత స్మారక భవనం నిర్మించాలని నిర్ణయించింది. తాజా వివ‌రాల ప్ర‌కారం కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారుల‌కు ఆదేశాలు జారీచేసింది.

ఇదిలాఉండ‌గా...త్వరలో ఆన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎంపిక జరుగనున్నట్టు ఆపార్టీ నేత సి.పొన్నయన్ తెలిపారు. అమ్మ ఉన్నపుడు పార్టీ ఎలా ఉందో ఇపుడు అలాగే ఉంటుందని, అమ్మ మార్గంలోనే తాము ప్రయాణిస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి కోసం ఎలాంటి ఎన్నికలు ఉండవని స్పష్టం చేశారు. అమ్మ లేనపుడు కూడా పార్టీ సమిష్టిగా ముందుకు వెళ్తుందన్నారు. అమ్మ ప్రవేశపెట్టిన పథకాలు, విధానలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.