Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీ లో భవానీ భావోద్వేగం.. లెక్క తేల్చాలి జగన్

By:  Tupaki Desk   |   17 Dec 2019 8:01 AM GMT
ఏపీ అసెంబ్లీ లో భవానీ భావోద్వేగం.. లెక్క తేల్చాలి జగన్
X
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి వ్యూహం లేకుండా.. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న విపక్ష నేత చంద్రబాబు కారణంగా ఏపీ అధికారపక్షానికి ఎప్పటికప్పుడు కలిసి వస్తున్న పరిస్థితి. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా ఇష్యూస్ ను తెర మీదకు తీసుకురావటంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని చెప్పాలి.

ఇలాంటి వేళ ఈ రోజు (మంగళవారం) టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ చేసిన ప్రసంగం భావోద్వేగానికి గురి చేయటమే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరీక్షగా మారాయని చెప్పాలి. ఈ రోజు సభ ప్రారంభమైన తర్వాత షురూ అయిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడారు. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు.

మద్యపాన నిషేధం మీద తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా విషపురాతలు రాస్తున్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద పెడుతున్న పోస్టులకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీలో తాను తప్పుగా మాట్లాడలేదని.. ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులు కూడా చెప్పారని.. వారి మద్దతు ఉందన్నారు.

అయినప్పటికీ సోషల్ మీడియాలో నీచాతినీచంగా రాతలు రాస్తున్నారని.. తానుపదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. చిన్నతనంలో తన తండ్రి.. ఇటు తన మామగారు ఎన్నో పదవుల్లో ఉన్నారని.. పదవులు తమకు కొత్తకాదన్నారు. తన తండ్రి ఎర్రంనాయుడు ఆశయ సాధన కోసం తాను రాజకీయాల్లో వచ్చినట్లు చెప్పిన భవానీ.. సోషల్ మీడియాలో నీచాతి నీచంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో దిశ చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భంగా.. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు చేస్తే సహించలేనని చెప్పారన్నారు. ఒక ఎమ్మెల్యేగా తన పరిస్థితే ఇలా ఉంటే.. సాధారణ మహిళల పరిస్థితేమిటి? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. దీంతో సభ గంభీరంగా మారింది. భవానీ ప్రసంగం.. ముఖ్యమంత్రి జగన్ కు పరీక్ష గా మారిందని చెప్పాలి. మరి.. ఆమె మీద సోషల్ మీడియాలో దారుణ వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.