Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి భారీ షాక్..

By:  Tupaki Desk   |   24 Nov 2022 6:34 AM GMT
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి భారీ షాక్..
X
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసులు నమోదు చేశారు. అంతేకాదు మరో ఇద్దరు కేరళకు చెందిన తుషార్, జగ్గూజీపై కూడా సిట్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈణెల 26 లేదా 28న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. ఈ ముగ్గురికి మరోసారి నోటీసులు అందజేసింది.

ఈ కేసుకు సంబంధించి బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు ఇవ్వడంతో ఇది రెండోసారి.. ఈనెల 16న సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఆ నోటీసులు ఆయనకు అందాయో లేదో సమాచారం తెలియరాలేదు. ఈనెల 21న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ బీఎల్ సంతోష్ మాత్రం విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయనకు నోటీసులు అందాయో లేదోనన్న అనుమానం నెలకొంది.

ఈ క్రమంలోనే నిన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇచ్చినా ఎందుకు రావడం లేదని.. గడువు కావాలని కోరుతున్నారా. లేక ఇంకేదైనా కారణమా? అని ప్రశ్నించింది. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ సిట్ అధికారులు బీఎల్ సంతోష్ కు అలాగే కేరళకు చెందిన జగ్గుజీ స్వామి, తుషార్ కూడా నోటీసులు ఇచ్చారు. అలాగే బీఎల్ సంతోష్ తోపాటు జగ్గుజీస్వామి, తుషార్ పై కేసునమోదు చేశారు.

ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉండడంతో విచారణకు హాజరు కాలేదని తెలుస్తోంది. అయితే మళ్లీ బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వాలని.. వాటిని ఈమెయిల్ ద్వారా పంపించాలని సిట్ కు కోర్టు తెలిపింది. దీంతో ఈరోజు పంపించారు.

ఎలాగైనా సరే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను విచారణకు రప్పించాలని సిట్ ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై ఈనెల 30న హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.