Begin typing your search above and press return to search.

బుగ్గ‌న‌.. ఇదేంద‌న్నా!

By:  Tupaki Desk   |   17 Nov 2021 11:30 AM GMT
బుగ్గ‌న‌.. ఇదేంద‌న్నా!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైసీపీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌కు భారీ షాక్ త‌గిలింది. జ‌గ‌న్ కేబినేట్‌లో కీల‌మైన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఆయ‌న నివాసం ఉండే వార్డులోనే గ‌ట్టి దెబ్బ త‌గిలింది. ఏపీలో వివిధ చోట్ల మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో కొన్ని చోట్లు అధికార వైసీపీ ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి.

బేతంచెర్ల మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ జెండా ఎగ‌రేసిన‌ప్ప‌టికీ బుగ్గ‌న‌కు మాత్రం దెబ్బ ప‌డింది. ఆయ‌న నివాసం ఉండే 15వ వార్డులో వైసీపీ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. వైసీపీ అభ్య‌ర్థిపై టీడీపీ అభ్య‌ర్థి వెంక‌ట సాయి కుమార్ 114 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ విజ‌యంతో టీడీపీ శ్రేణులు అక్క‌డ గొప్ప ఉత్సాహంతో ఘ‌నంగా సంబరాలు చేసుకుంటున్నాయి.

బేతంచెర్ల‌లో మొత్తం 20 వార్డ‌లుండ‌గా 14 చోట్ల వైసీపీ, 6 చోట్ల టీడీపీ నెగ్గింది. ఆ మున్సిపాలిటీని వైసీపీనే హ‌స్త‌గ‌తం చేసుకున్న‌ప్ప‌టికీ బుగ్గ‌న‌కు మాత్రం ఇది గ‌ట్టి దెబ్బే అని చెప్పాలి. మ‌రోవైపు ఇదే జిల్లాలో జ‌రిగిన స‌ర్పంచ్‌, వార్డు ఎన్నిక‌ల్లోనూ వైసీపీకి ఊహించ‌ని షాక్‌లు త‌గిలాయి. క‌ర్నూలు జిల్లా నంద్యాల మండ‌లం భీమ‌వ‌రంలో 4వ వార్డులో వైసీపీ అభ్య‌ర్థి నాగ‌పుల్లారెడ్డిపై టీడీపీ అభ్య‌ర్థి జ‌నార్ధ‌న్ గెలిచారు. 12 ఓట్ల తేడాతో ఆయ‌న ప్ర‌త్య‌ర్థిని ఓడించారు. నంద్యాల వైసీపీ జెడ్పీటీసీ అభ్య‌ర్థి గోకుల కృష్ణారెడ్డి సొంత వార్డులోనే ఇలా ఓట‌మి చెంద‌డం గ‌మ‌నార్హం. ఎమ్మిగ‌నూరు మండ‌లం కె.తిమ్మాపురంలోనూ వైసీపీ వార్డు అభ్య‌ర్థిపై 38 ఓట్ల‌తో సీపీఐ అభ్య‌ర్థి మ‌హేశ్వ‌రి విజ‌యాన్ని అందుకున్నారు. కృష్ణ‌గిరి మండంల ల‌క్క‌సాగ‌రం గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లో టీడీపీ రెబ‌ర్ అభ్య‌ర్థి వ‌ర‌ల‌క్ష్మి 858 ఓట్ల మెజారిటీతో ప్ర‌త్య‌ర్థిపై పైచేయి సాధించారు.