Begin typing your search above and press return to search.

బీజేపీ సీఎం నోట పాడు మాటలు.. జైలుకు వెళ్లండి నేతలవుతారు

By:  Tupaki Desk   |   4 Oct 2021 3:59 AM GMT
బీజేపీ సీఎం నోట పాడు మాటలు.. జైలుకు వెళ్లండి నేతలవుతారు
X
ఆదివారం ఒక్కరోజులో చోటు చేసుకున్న పలు పరిణామాలు కేంద్రంలోని మోడీ సర్కారుకు చిరాకు తెప్పించేలా మారటమే కాదు.. ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చాయి. యూపీలో రైతుల ప్రాణాల్ని బలి తీసుకున్న కేంద్ర సహాయ మంత్రి కొడుకు దూకుడు వివాదాస్పదంగా మారితే.. అందుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జైలుకు వెళితే నేతలు అవుతారని.. రైతు నిరసనలు జరుగుతున్న చోటుకు బీజేపీ కార్యకర్తలు 500 నుంచి 700.. వెయ్యి వరకు గుంపులుగా వెళ్లాలని.. ఈ సందర్భంగా కేసులు అయి జైలుకు వెళితే అస్సలు బాధ పడాల్సిన అవసరంలేదని.. ఎందుకంటే నేతలు అవుతారని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘రైతుల భాషలోనే వారికి సమాధానం చెబుదాం’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ గా మారింది.

జైలుకు వెళ్లిన వారు బాధ పడొద్దని.. జైలుకు వెళితే మహా అయితే నెల కానీ మూడునెలలు కానీ ఉంటారని.. కానీ ఆ తర్వాత పెద్ద నేతలు అవుతారని.. చరిత్రలో వారి పేర్లు నిలిచిపోతాయన్న మాట ఆయన నోటి నుంచి రావటం గమనార్హం. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రైతులపై నేరుగా దాడులు చేయాలంటూ ముఖ్యమంత్రే స్వయంగా తన వారిని రెచ్చగొడుతున్నారన్నారు. హింసను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి మాటలు ఉన్నాయని మండిపడుతున్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చెబుతున్నారని.. ఇలాంటి వేళ రాష్ట్రంలో రాజ్యాంగం ఎలా నడుస్తుంది? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మీద దేశ ద్రోహం కేసు పెట్టాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. మొత్తంగా అవసరానికి మించిన మోతాదుతో మాట్లాడిన హర్యానా ముఖ్యమంత్రి మాట ఇప్పుడు వివాదాస్పదంగా.. రైతులకు వ్యతిరేకంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.