Begin typing your search above and press return to search.

బీజేపీ-జనసేన చెరోదారి..భిన్నమైన ప్రకటనలు!!

By:  Tupaki Desk   |   19 Nov 2020 1:50 PM GMT
బీజేపీ-జనసేన చెరోదారి..భిన్నమైన ప్రకటనలు!!
X
కనీసం పార్టీలు మాట్లాడుకోవడానికి కూడీ అవకాశం లేకుండా కేసీఆర్ సర్కార్ జీహెచ్ఎంసీ ఎన్నికలను ఆగమేఘాల మీద ప్రకటించింది. నామినేషన్లకు మూడే రోజులు గడువు పెట్టారు. ఇప్పటికే ఇది రెండోరోజు. ఇంకా పార్టీలకు అభ్యర్థులే ఖరారు కాలేదు. బీజేపీ, జనసేనలు ఏపీలో పొత్తుతో ముందుకు వెళుతున్నాయి. తెలంగాణకు వచ్చేసరికి మాత్రం పొత్తుపై స్పష్టత రావడం లేదు.

కాగా ఎన్నికలలో కలిసి పోటీచేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని బీజేపీ అగ్రనేతలతో పవన్ కళ్యాణ్ భేటి అవుతారని జనసేన తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో మళ్లీ పొత్తు ఆశలు చిగురించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు మధ్యాహ్నం పవన్ ను కలుస్తున్నారని జనసేన ఒక ప్రకటనలో పేర్కొంది.

అయితే బండి సంజయ్ మాత్రం భిన్నమైన ప్రకటన చేశారు. తాను పవన్ కళ్యాణ్ తో భేటి కావడం లేదని స్పష్టతనిచ్చారు.తమ పార్టీ అభ్యర్థుల లిస్ట్ ఇప్పటికే ఖరారయ్యిందని తెలిపారు. తమ దగ్గరకు జనసేన ఎలాంటి ప్రతిపాదన తేలేదని చెప్పారు. పవన్ మీద తమకు గౌరవం ఉందని స్పష్టం చేశారు.

పరస్పర భిన్నమైన ప్రకటనల నేపథ్యంలో బీజేపీ-జనసేన పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తున్న వేళ ఈ పొత్తు తేలుతుందా? కలిసి పోటీచేస్తారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.