Begin typing your search above and press return to search.

ఆ హీరో భార‌తీయుడు కాదంటున్న బీజేపీ నేత‌!

By:  Tupaki Desk   |   14 July 2022 7:30 AM GMT
ఆ హీరో భార‌తీయుడు కాదంటున్న బీజేపీ నేత‌!
X
బీజేపీని విమ‌ర్శించేవారిని, బీజేపీ విధానాల‌ను ప్ర‌శ్నించేవారిపై దేశ‌ద్రోహి ముద్ర వేస్తున్నార‌ని చాలాకాలంగా ఆ పార్టీపై విమ‌ర్శ‌లున్నాయి. ఈ విష‌యంలో సామాన్యుల‌తోపాటు, సెల‌బ్రిటీలు ప్ర‌తిప‌క్ష నేత‌లు, సినిమా తార‌లు ఇలా అంద‌రూ బీజేపీ చేతిలో ఇబ్బందులు ఎదుర్కొన్న‌వారేన‌ని చెబుతున్నారు.

ముఖ్యంగా.. ప్ర‌కాష్ రాజ్, క‌మ‌ల్ హాస‌న్, న‌టీమ‌ణులు స్వ‌ర భాస్క‌ర్, రిచా చ‌ద్దా త‌దిత‌రులు బీజేపీ అతివాదుల చేతిలో తీవ్ర విమ‌ర్శ‌లు, బెదిరింపులు ఎదుర్కొన్నారు. వారిపై వివిధ రాష్ట్రాల్లో బీజేపీ నేత‌లు కేసులు సైతం న‌మోదు చేయించారు. దీనిపై ప్ర‌జాస్వామ్య‌వాదులు, కోర్టుల నుంచి విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నా బీజేపీ నేత‌లు లెక్క చేయ‌డం లేదు.

తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో పార్లమెంట్ కొత్త భవనంపై ఆవిష్కరించిన నాలుగు సింహాల‌ జాతీయ చిహ్నం స‌రిగా లేద‌ని.. సింహాలు శాంత ముద్ర‌తో కాకుండా ఆగ్ర‌హంతో ఉన్నాయ‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సార‌నాథ్ లో ఉన్న జాతీయ చిహ్నంను వ‌క్రీక‌రించి పార్ల‌మెంట్ భ‌వ‌నంపై నిర్మించార‌ని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి.

కాగా ఈ జాతీయ చిహ్నం ఎదుట న్యూఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హిందూ పద్దతిలో పూజలు చేయడాన్ని ప్రశ్నిస్తూ హీరో సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. ఒకవేళ ఉప రాష్ట్రపతిగా హమీద్ అన్సారీ ఉండి ముస్లిం పద్దతిలో ఈ జాతీయ చిహ్నానికి పూజలు చేసినట్లయితే బీజేపీ నేతలు ఎలా స్పందించేవారోనని సిద్ధార్థ్ త‌న ట్వీటులో వ్యంగాస్త్రాలు సంధించారు.

ఈ ట్వీట్‌పై బీజేపీ ఏపీ నేత విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. అసలు సిద్ధార్థ్ భార‌తీయ పౌరుడే కాద‌న్నారు. అమెరికా పౌరుడైన సిద్ధార్థ్ కు భారత అంతర్గత విషయాలపై అంత ఆసక్తి ఎందుకని విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి నిల‌దీశారు. అమెరికా అధ్యక్షుడ్ని బైబిల్ పట్టుకోవడంపై ఎప్పుడైనా ప్రశ్నించారా అని సిద్ధార్థ్ ను ప్ర‌శ్నించారు.

అయితే దీనికి సిద్ధార్థ్ బ‌య‌ప‌డ‌కుండా రిప్లై ఇచ్చారు. తాను అడిగిన సాధార‌ణ‌మైన ప్ర‌శ్న‌కు కూడా ఎందుకు సమాధానం చెప్పడం లేదని సిద్ధార్థ్ ప్ర‌శ్‌నించారు.

కాగా సిద్ధార్ధ , విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య ట్విట్టర్ సంవాదం ఇప్పుడే కాదు గతంలోనూ జ‌రిగింది. సిద్దార్థ్ సినిమాలకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఫైనాన్స్ చేస్తున్నాడ‌ని విష్ణువర్ధన్ రెడ్డి గ‌తేడాది ఆరోపించారు. దీనికి అప్పట్లో సిద్ధార్థ్ కూడా కౌంటర్ ఇచ్చారు.

కాగా తాజాగా విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి ట్వీట్ల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. బీజేపీని, బీజేపీ ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నిస్తే వారిపై దేశ ద్రోహి ముద్ర‌, విదేశీల‌యుల‌ని ముద్ర వేస్తున్నారు. కాగా అడిగిన ప్ర‌శ్న‌కు బీజేపీ నేత‌ల‌కు ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో స‌మాధానం చెప్ప‌డం కూడా చేత‌కాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.