Begin typing your search above and press return to search.

షాకు మళ్లీ బిస్కెట్లు వేసిన తెలంగాణ బీజేపీ నేతలు

By:  Tupaki Desk   |   10 April 2019 7:25 AM GMT
షాకు మళ్లీ బిస్కెట్లు వేసిన తెలంగాణ బీజేపీ నేతలు
X
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను చాలామంది టఫ్ మాస్టర్ గా అభివర్ణిస్తుంటారు. ఆయన దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడితే ఊరుకోరని.. ఆ సాహసం చేయటానికి సీనియర్ నేతలు కూడా ముందుకు రారని చెబుతారు. ఉత్తరాదిన ఇలా ఉండే అమిత్ షా దక్షిణాదిన..అందునా తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఆయన తీరు భిన్నంగా మారతుందని చెబుతారు.

తాజాగా శంషాబాద్ లో ఏర్పాటు చేసిన సభకు హాజరైన అమిత్ షా.. కేసీఆర్ మీద సీమటపాకాయల్లాంటి కొన్ని విమర్శలు చేసి.. సభను పూర్తి చేశారు. సభ అనంతరం తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అయిన సందర్భంగా సాగిన సమావేశం ఆసక్తికరంగా సాగినట్లు చెబుతారు.

తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ బీజేపీ నేతలు ఆయనకు బిస్కెట్లు వేస్తుంటారని.. తమ మాటలతో ఆయన కడుపు నింపి పంపుతారని.. తాజాగా అదే తంతు సాగినట్లు చెబుతున్నారు. గతం కంటే రాష్ట్రంలో బీజేపీ బలపడిందని.. ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామన్న మాటను చెప్పినట్లు తెలుస్తోంది.

ఎన్నికల ప్రచారంలో టీఆర్ ఎస్.. కాంగ్రెస్ పార్టీల తీరు తెన్నుల గురించి ప్రశ్నించగా.. కాంగ్రెస్ ను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని.. టీఆర్ ఎస్ కు గట్టిపోటీ ఇచ్చేలా ప్రచారం చేస్తున్నట్లుగా చెప్పి షా చెవిలో పువ్వులు పెట్టారని చెబుతున్నారు. బీజేపీ పరిస్థితి గతంలో కంటే ప్రస్తుతం బాగుంటుందంటూ బిస్కెట్ వేసిన బీజేపీ నేతలు.. తమ మధ్యనున్న లుకలుకల మీద మాత్రం ఎలాంటి వాసన రాకుండా జాగ్రత్త పడినట్లుగా తెలుస్తోంది. షా సభకు ఒక రోజు ముందు పార్టీకి చెందిన రూ.8 కోట్లు పట్టుబడటం.. దీనిపై ఆయన పెదవి విప్పక పోవటం గమనార్హం. ఎప్పటిలానే ఈసారి కూడా తెలంగాణకు వచ్చిన షా మాష్టారికి తెలంగాణ బీజేపీ నేతలు బిస్కెట్లు వేసినట్లుగా ప్రచారం సాగుతోంది.