Begin typing your search above and press return to search.

ముస్లింల‌ను నిషేధించాలంటున్న ఎంపీ

By:  Tupaki Desk   |   31 Jan 2017 5:28 AM GMT
ముస్లింల‌ను నిషేధించాలంటున్న ఎంపీ
X
వివాదాస్ప‌ద వ్యాఖ్యలకు పెట్టింది పేర‌యిన బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ మ‌రోమారు క‌ల‌క‌లం రేకెత్తించే వ్యాఖ్య‌లు చేశారు. యూపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..ట్రంప్‌ నిర్ణయం ప్రశంసనీయమ‌ని తెలిపారు. విదేశాల నుంచి ముస్లింల రాకపై భారత్ లోనూ ఆంక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింల రాకపై దేశంలోనూ ఆంక్షలు అమలు చేసినప్పుడే ఉగ్రవాదాన్ని నియంత్రించ గలుగుతామ‌ని యోగీ ఆదిత్య‌నాథ్ వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా యూపీ రాజ‌కీయాల‌పైనా ఆదిత్య‌నాథ్ స్పందించారు. త‌మ పార్టీకి బీసీలు దూరమవుతారన్న భయంతోనే.. కాంగ్రెస్‌, ఎస్పీ దోస్తీపై స‌మాజ్ వాదీ వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు అందులోనూ ముఖ్యంగా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో పార్టీ తరపున ప్రచారం కోసం 40 మంది ప్రధాన ప్రచారకర్తల పేర్లను బీజేపీ ప్రకటించ‌గా. వారిలో ఆదిత్య‌నాథ్ ఒక‌రు. ఇదిలాఉండ‌గా... గ‌తంలోనూ ఆదిత్య‌నాథ్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పార్ల‌మెంటు స‌మావేశాల జీరో అవర్‌ లో యోగి ఆదిత్యనాథ్ భగవద్గీతను 'జాతీయ గ్రంథం'గా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 'జిహాదీ' ఉగ్రవాదంపై యావత్‌ ప్రపంచం ఆందోళన చెందుతున్న ఈ సమయంలో భగవద్గీత బోధనలు సందర్భోచితంగా ఉంటాయని ఆయ‌న‌ అన్నారు. మానవత్వానికి ఈ పవిత్ర గ్రంథం దిశానిర్దేశం చేస్తుందని చెప్పారు. భగవద్గీతను పాఠ్యాంశాలలో భాగంగా చేర్చాలని సూచించారు. దీంతో పాటుగా ముస్లింల‌పైనా ఆయ‌న ప‌లు కామెంట్లు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/