Begin typing your search above and press return to search.

మోడీ బొమ్మ పెట్టలేదనే కమలనాథులు.. కేసీఆర్.. జగన్ ఫోటోలు పెట్టరేం?

By:  Tupaki Desk   |   2 Sep 2022 9:30 AM GMT
మోడీ బొమ్మ పెట్టలేదనే కమలనాథులు.. కేసీఆర్.. జగన్ ఫోటోలు పెట్టరేం?
X
విన్నంతనే పిడి వాదనలా అనిపించొచ్చు. కానీ.. లోతుగా ఆలోచించి.. దానికి లాజిక్ యాడ్ చేస్తే నిజమే కదా అనిపిస్తుంది. సమాఖ్య విధానాన్ని అనుసరించే దేశంలో.. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలే కానీ.. కర్ర పెత్తనం చేయటానికి కుదరదు. పెద్దన్నలా ఉంటామని చెప్పుకునేటప్పుడు పెద్దరికంతో వ్యవహరించాలే తప్పించి.. తమను తాము గొప్పగా చూపించుకునే ప్రయత్నం తప్పే అవుతుంది.

అదెలానంటే.. కేంద్రం అమలు చేసే పథకాలకు ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ఫోటోలు పెట్టుకుంటున్నారే తప్పించి ప్రధాని నరేంద్ర మోడీ పెట్టటం లేదంటూ బీజేపీ నేతలు తెగ వాదనలు వినిపిస్తుంటారు. కొన్నిసార్లు తమ ఆవేదనను.. ఆక్రోశాన్ని ప్రెస్ మీట్లలో అదే పనిగా ప్రదర్శిస్తుంటారు. ఇదంతా ఎందుకంటే.. కేంద్రం నిధులు ఇస్తున్నప్పుడు.. వాటిని వాడుకునే రాష్ట్రాలు.. తమ అధినేత మోడీ ఫోటోను పెట్టుకొని అదంతా తమ ఘనకార్యంగా చాటుకోవాలనే ప్రయత్నం.

వారి వాదనలో నిజం ఎంతన్నది కాసేపు చూద్దాం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వసూలు చేసే పన్నుల్లో సగం కేంద్రమే తీసుకుంటుంది. ఎందుకలా? అంటే.. కేంద్రం నిర్వహించే రక్షణ.. అంతర్గత భద్రతతో పాటు మరికొన్ని అంశాలకునిధులు అవసరంకాబట్టి. అంటే.. కేంద్రానికి నేరుగా వచ్చే ఎక్సైజ్ పన్నుతో పాటు ఆదాయపన్ను మినహా జీఎస్టీ లాంటివి రాష్ట్రాలకు సగం ఇచ్చి కేంద్రం సగం తీసుకుంటుంది. ఇలా ఆయా రాష్ట్రాల నుంచి వసూలు చేసే మొత్తాల్ని.. దేశ వ్యాప్తంగా ఉండే ఇతర రాష్ట్రాలకు పంచుతూ ఉంటుంది.

దేశంలోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. రెండు తెలుగురాష్ట్రాల జీఎస్టీ ఆదాయం అత్యధికంగా ఉంటుంది. ఎక్కడిదాకానో ఎందుకు.. ఈ ఆగస్టు జీఎస్టీ వసూళ్లలో ఏపీ మొదటి స్థానంలో నిలిస్తే.. తెలంగాణ రాష్ట్రం సైతం టాప్ ఫైవ్ స్టేట్ లలో ఒకటిగా నిలిచింది. అంటే.. రెండు తెలుగు రాస్ట్రాల్లో వసూలు చేసే జీఎస్టీలో సగభాగాన్ని కేంద్రం తీసుకున్నప్పుడు.. ఆ మొత్తాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు.. మిగిలిన రాష్ట్రాలకు కూడా పంచుతుంది. ఆదాయం ఎక్కువ వచ్చే రాష్ట్రాల నుంచి తీసుకున్న వాటిని ఆదాయం తక్కువగా ఉండే రాష్ట్రాలకు సర్దుబాటు చేస్తుంది.

భౌగోళికంగా చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్ చాలా పెద్దది. అయినా.. ఆ రాష్ట్రం నుంచి వచ్చే జీఎస్టీ ఆదాయంతో పాటు.. ఇతర ఆదాయాలు చాలా తక్కువ. అదే సమయంలో.. ఆ రాష్ట్రానికి కేంద్రం చేసే కేటాయింపులు ఎక్కువగా ఉంటాయి.కేంద్రం ఇచ్చే నిధులు ఎక్కడివి? అంటే.. పన్ను అధికంగా వసూలయ్యే రెండు తెలుగు రాష్ట్రాల వాటా ఉంటుంది.

బీజేపీ నేతల లాజిక్ ప్రకారం డబ్బులు ఇచ్చే కేంద్రం తాలుకూ మోడీ ఫోటోను రెండు తెలుగు రాష్ట్రాలు పెట్టాలన్నదే కరెక్టు అయితే..అత్యధిక పన్ను ఆదాయం ఇస్తూ కూడా తక్కువ నిధుల్ని తాము తీసుకొని.. బీజేపీ ఏలుబడిలో ఉండే రాష్ట్రాలకు అవసరమైన నిధులు సపోర్టు చేసే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోల్ని యూపీలో పెట్టుకోవాలి కదా? అదే న్యాయం కూడా కదా? డబ్బులిచ్చిన వారి ఫోటోలు పెట్టాలంటే.. కేసీఆర్.. జగన్ ఫోటోల్ని పెట్టాలి. మరి.. బీజేపీ నేతలు అందుకుఓకేనా? అన్నది ప్రశ్న.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.