Begin typing your search above and press return to search.

ఖుష్బూకు రాజ్యసభ సీట్ ఇవ్వనున్న బీజేపీ?

By:  Tupaki Desk   |   7 Nov 2020 3:30 PM GMT
ఖుష్బూకు రాజ్యసభ సీట్ ఇవ్వనున్న బీజేపీ?
X
ఇటీవల కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన నటి ఖుష్బు కు ప్రమోషన్ దక్కే అవకాశాలున్నాయని సమాచారం. ఆమెను కమలం పార్టీ అందలం ఎక్కించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఖుష్బును రాజ్యసభకు పంపాలని బిజెపి నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఆమె పేరును నామినేట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

గత జూన్ నెలలో కర్ణాటక రాష్ట్ర కోటా నుండి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటన్నింటినీ బిజెపి గెలిచింది. కాని కరోనా కారణంగా అశోక్ గాస్టి అనే సభ్యుడు కన్నుమూశారు. ఖాళీగా ఉన్న ఈ సీటుకు డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని ఇటీవల భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఇతర రాష్ట్రాల నుంచి ఒక వ్యక్తిని నామినేట్ చేయడం కర్ణాటక కోటా నుంచి సాధారణంగా జరుగుతున్న పద్ధతి. కాబట్టి బీజేపీ ఈ సీటును ఖుష్బుకు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిసింది.. వచ్చే ఏడాది మధ్యలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ కావడంతో, ఖుష్బుకు రాజ్యసభ టికెట్ ఇవ్వడం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో కొంత సమతుల్యం తేవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించడానికి బిజెపి ఆసక్తిగా ఉంది. అక్కడ ఓటుబ్యాంకును పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం బిజెపి ఖుష్బూకు పదవి ఇవ్వడం ద్వారా పార్టీలో జోష్ నింపి నేతలు పనిచేసేలా ప్రోత్సహించాలని భావిస్తోంది.

అయితే ఖుష్బు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. బిజెపి రాజ్యసభ ప్రతిపాదనను ఆమె అంగీకరిస్తారా అనేది ఇంకా తెలియరాలేదు. ఖుష్బు రాష్ట్ర రాజకీయాల్లో రాణించాలని చూస్తోంది. దీంతో ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటోందని సమాచారం. బీజేపీ ఆఫర్ ను స్వీకరిస్తారా లేదా అన్నది చూడాలి.