Begin typing your search above and press return to search.

భార‌త గ‌గ‌న‌తలంలో ఉండ‌గా విమానానికి బాంబు బెదిరింపు.. పైల‌ట్ ఏం చేశాడంటే!

By:  Tupaki Desk   |   4 Oct 2022 11:30 AM GMT
భార‌త గ‌గ‌న‌తలంలో ఉండ‌గా విమానానికి బాంబు బెదిరింపు.. పైల‌ట్ ఏం చేశాడంటే!
X
భారత గగనతలంలో ఒక విమానానికి బాంబు బెదిరింపు రావ‌డం తీవ్ర ఆందోళ‌న, ఉత్కంఠ రేపింది. ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌ నుంచి చైనాలోని గ్వాంఘ్జుకు వెళ్తున్న మహన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో బాంబు ఉన్నట్లు పాకిస్థాన్‌లోని లాహోర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్ (ఏటీసీ) సిబ్బందికి ఫోన్ వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో విమానం భార‌త గ‌గ‌న‌తలంలో ఉంది.

దీంతో లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది వెంట‌నే ఢిల్లీ ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్ కు స‌మాచారం అంద‌జేశారు. భారత వైమానికదళం అధికారులు ఢిల్లీ విమానాశ్రయాన్ని అప్ర‌మ‌త్తం చేశారు.

అంతేకాకుండా ఆ విమానంలోని పైల‌ట్‌కి జైపూర్‌ లేదా చండీగఢ్‌లలో ల్యాండ్‌ అయ్యేలా రెండు ఆప్షన్‌లు ఇచ్చారు. దీంతో ఆ విమానం అత్య‌వ‌స‌రంగా ఢిల్లీ విమానాశ్ర‌యంలో ల్యాండ్ అవుతుందని అంచ‌నా వేశారు.

దీంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంత స‌మ‌యం క‌ల‌క‌లం రేకెత్తింది. అధికారులు హుటాహుటిన విమానాశ్ర‌యానికి చేరుకొని ముందు జాగ్రత్త చర్యలు చేప‌ట్టారు. ఫైటర్‌ జెట్లు, అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు. ఏదైనా అనుకోనిది త‌లెత్తితే వెంటాడేందుకు ఫైట‌ర్ జెట్లు సిద్ధ‌మ‌య్యాయి.

కొంత స‌మ‌యం గ‌డిచాక‌ ఆ విమానం ఢిల్లీ విమానాశ్ర‌యంలో దిగ‌డంలేద‌ని తెలిసింది. చండీగ‌ఢ్ లో లేదంటే జైపూర్ లో దిగొచ్చ‌ని అనుకున్నారు. ఐతే పైలెట్‌ ఆ రెండు విమానాశ్రయాల్లో విమానాన్ని మళ్లించడానికి ఇష్టపడ లేదు.

బాంబు బెదిరింపులతో విమానాన్ని ఎక్కడ ల్యాండ్‌ చేసేందుకు పైల‌ట్ ఇష్టపడలేదు. చైనాలోని తన గమ్యస్థానం గ్వాంఘ్జు వైపే సాగిపోయాడు. కాగా ఆ విమానాన్ని భార‌త్ కు చెందిన రెండు యుద్ధ విమానాలు సురక్షిత దూరం నుంచి అనుసరించినట్లు భారత వైమానిక దళం వెల్ల‌డించింది. ఆ విమానం చైనా గగనతలంలోకి ప్రవేశించిందని ప్లైట్‌ ట్రాకింగ్‌ వైబ్‌సైట్‌ ఫ్లైట్‌ రాడార్‌ చూపించినట్లు పేర్కొంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.