Begin typing your search above and press return to search.

ముఖ ఆధారిత హాజ‌రు జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టింది అందుకేనా?

By:  Tupaki Desk   |   1 Sep 2022 9:44 AM GMT
ముఖ ఆధారిత హాజ‌రు జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టింది అందుకేనా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అయిన‌ప్ప‌టికీ వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం సెప్టెంబ‌ర్ 1 గురువారం నుంచి ముఖ ఆధారిత హాజ‌రు (ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్) ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీని ప్ర‌కారం.. సెప్టెంబ‌ర్ 1 నుంచి ప్రైవేటు ఉపాధ్యాయులు మిన‌హాయించి అన్ని ప్ర‌భుత్వ యాజ‌మాన్యాల్లోని ప్ర‌భుత్వ టీచ‌ర్లు త‌ప్ప‌నిస‌రిగా ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకుని హాజ‌రును న‌మోదు చేయాల్సి ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో మండ‌ల పరిష‌త్ స్కూల్ టీచ‌ర్లు, జిల్లా ప‌రిష‌త్ స్కూల్ టీచ‌ర్లు, మున్సిప‌ల్ టీచ‌ర్లు, గిరిజన గురుకుల సొసైటీ, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ, ఎస్సీ గుర‌కులాలు, మైనార్టీ గురుకులాలు, మోడ‌ల్ స్కూళ్లు, అన్ని ర‌కాల ప్ర‌భుత్వ స్కూళ్ల టీచ‌ర్లు ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ యాప్ ద్వారా త‌మ మొబైల్ ఫోన్ల‌లో హాజ‌రు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు లేక‌పోతే హెడ్మాస్ట‌ర్టు లేదా ఇత‌ర ఉపాధ్యాయుల వ‌ద్ద ఉండే ఫోన్ల ద్వారా హాజ‌రు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది.

కేవ‌లం ఒక్క ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌కే కాకుండా పాఠ‌శాల విద్యా శాఖ ప‌రిధిలోని అన్ని ప్ర‌భుత్వ విద్యా కార్యాల‌యాలు, రీజ‌న‌ల్ జాయింట్ డైరెక్ట‌ర్ కార్యాల‌యాలు, జిల్లా విద్యా శాఖాదికారి కార్యాల‌యాలు, మండ‌ల విద్యాశాఖాదికారి కార్యాల‌యాల్లో సిబ్బందికి, బోధ‌నేత‌ర సిబ్బందికి కూడా ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ను త‌ప్ప‌నిస‌రి చేశారు. దీనిపై ప్ర‌భుత్వ ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతుండ‌టంతో త్వ‌ర‌లోనే అన్ని ప్ర‌భుత్వ విభాగాల్లోనూ ఫేషియ‌ల్ రికగ్నిష‌న్ హాజ‌రును ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

వాస్తవానికి, ఉపాధ్యాయులందరూ ఈ ఫేస్ రికగ్నిషన్ అప్లికేషన్‌ను తమ మొబైల్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉపాధ్యాయులు అనేక సాకులతో దానిని డౌన్‌లోడ్ చేయడానికి నిరాకరిస్తున్నారని స‌మాచారం.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్‌వ‌ర్క్ స‌మ‌స్యలతో యాప్ ఓపెన్ కావ‌డం లేద‌ని, ఇంట‌ర్నెట్ స‌మ‌స్య‌లతో మొబైల్ ద్వారా హాజ‌రు న‌మోదు క‌ష్టంగా ఉంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప‌ది నిమిషాలు గ్రేస్ పీరియ‌డ్ ను కూడా ప్ర‌క‌టించింది.

ఉపాధ్యాయులు నిర్దేశిత‌ సమయానికి విధులకు హాజరై తరగతులు నిర్వహించేలా ప్రభుత్వం ఈ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇన్ని రోజులూ టీచర్లు బోధించే స్కూలుకు ఆల‌స్యంగా చేరుకోవ‌డం, రిజిస్ట‌ర్ల‌లో త‌ప్పుడు సంత‌కాలు పెట్ట‌డం వంటివి చేస్తున్నార‌ని ప్ర‌భుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఫేసియ‌ల్ రిక‌గ్నిష‌న్ ను త‌ప్ప‌నిస‌రి చేశామ‌ని అంటున్నారు.

ఇప్పుడు తాజా అప్లికేషన్‌తో ఉపాధ్యాయులు పాఠశాలల ముందు నిల్చొని వారి ముఖాలతో పాటు హాజరును గుర్తించాలి. మొబైల్ అప్లికేషన్‌లో వారి హాజరును వారి ముఖాలతో సహా గుర్తించడానికి 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఉపాధ్యాయుల హాజ‌రు జిల్లా విద్యాశాఖాధికారుల‌కు చేరుతుంది.

కాగా ముఖ ఆధారిత హాజ‌రు (ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్) త‌ప్ప‌నిస‌రి చేయ‌డం ఉపాధ్యాయుల‌ చిత్తశుద్ధిని శంకించడమేనని ఉపాధ్యాయులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది ఉపాధ్యాయులకు వై-ఫై కనెక్టివిటీ లేదని, వారికి మొబైల్ డేటా నెట్‌వర్క్ ఉన్నప్పటికీ, అప్లికేషన్ సమయానికి పనిచేయదని చెబుతున్నారు. హాజరును అప్‌లోడ్ చేయడానికి యాప్ సమయం తీసుకుంటుందని వారు అంటున్నారు. ఒకే సమయంలో రెండు లక్షల మంది ఉపాధ్యాయులు లాగింగ్‌ చేయడంతో సర్వర్‌ జామ్‌ అవుతున్నందున సర్వర్‌ సమస్యలపై కూడా ఫిర్యాదు చేస్తున్నారు.

అయితే ప్రభుత్వం మాత్రం అదే అమలుకు మొగ్గు చూపుతోంది. రాష్ట్రంలో ఎక్కడా డేటా సమస్యలు లేవని, అందుకే వాటిని సాకుగా చూపలేమని పేర్కొంది. 10 నిమిషాల గ్రేస్ టైమ్ ఇస్తున్నందున ఉపాధ్యాయులు సులభంగా హాజ‌రు న‌మోదు చేయ‌వ‌చ్చని చెబుతోంది..

ఏవైనా సమస్యలు ఎదురైతే, ఉపాధ్యాయుల హాజరును సమర్థిస్తూ ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపాల్ చెప్పేదాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని అంటోంది. అలాగే ఈ మొబైల్ అప్లికేషన్‌లో విద్యార్థుల హాజరును కూడా అప్‌లోడ్ చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలతో మరోసారి సమావేశమై ఈ హాజ‌రు విధానంలో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించాలని భావిస్తున్నారు.

అయితే గ‌తంలో పీఆర్సీ ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా జీతాల పెంపు, పెండింగ్ బ‌కాయిల చెల్లింపు త‌దిత‌రాల సంద‌ర్భంగా ఉపాధ్యాయులు భారీ ఎత్తున ఛ‌లో విజ‌య‌వాడ పేరుతో నిర‌స‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంటెలిజెన్స్, పోలీసుల క‌న్నుగ‌ప్పి ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉపాధ్యాయులు విజ‌య‌వాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో భారీ ఎత్తున గుమికూడారు. ఈ నేప‌థ్యంలో వీరి రాక‌ను ప‌సిగట్ట‌డంతో విఫ‌ల‌మ‌వ్వ‌డం వ‌ల్లే నాటి డీజీపీ గౌతం స‌వాంగ్ ప‌ద‌వి కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

నాడు ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల నిర‌స‌న‌తో ప్ర‌భుత్వం ఇరుకున‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో త‌మ‌ను ఇబ్బందిపెట్టిన ఉపాధ్యాయుల‌కు చుక్కలు చూపించ‌డానికే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ యాప్ ను తెచ్చింద‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.