Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఫోన్ కాల్

By:  Tupaki Desk   |   23 March 2022 9:40 AM GMT
ప్రధాని మోడీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఫోన్ కాల్
X
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తుండడం.. భారత తటస్థ వైఖరి నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తాజాగా భారత ప్రధానితో ఫోన్ లో చర్చలు జరిపారు. ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు కూలంకషంగా చర్చించినట్టు పేర్కొంది. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య శత్రుత్వాన్ని అంతం చేసి.. దౌత్యమార్గానికి తిరిగి రావాలని ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు భారత్ నిరంతరం కట్టుబడి ఉంటుందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు.

సమకాలీన ప్రపంచవ్యవస్థకు ప్రాతిపదికగా అంతర్జాతీయ చట్టం అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారంపై భారతదేశానికి ఉన్న నమ్మకాన్ని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకారం.. ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక ప్రయోజనాలపై చర్చించారని తెలిసింది. వాణిజ్యం, సాంకేతిక పెట్టుబడులు, రక్షణ-భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాలలో సహకారాన్ని మరింత పెంచుకునే సామర్థ్యాన్ని అంగీకరించారు. ద్వైపాక్షిక స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందంపై చర్చలు సానుకూలంగా సాగినట్లు ప్రధాని మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది ఇద్దరు నేతల మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ సందర్భంగా ఆమోదించిన ‘ఇండియా-యూకే రోడ్ మ్యాప్ 2030’ అమలులో సాధించిన పురోగతిని కూడా ఆయన అభినందించారు.

ప్రధానమంత్రి జాన్సన్ ను త్వరలో భారతదేశం పర్యటనకు రావాలని ప్రధాన మంత్రి ఆహ్వానించినట్లు సమాచారం. రష్యా, ఉక్రెయిన్ మధ్య దాదాపు నెలరోజులుగా యుద్ధం కొనసాగుతోంది. దీని కారణంగా ఇప్పటివరకూ 35 లక్షల మంది దేశం విడిచి వెళ్లిపోయారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచదేశాలు అభ్యర్థిస్తున్నాయి. యుద్ధం ఆపడానికి ఇప్పుడు బ్రిటన్ దేశం భారత్ సహాయం కోరినట్టు తెలిసింది. రష్యాను ఒప్పించే శక్తి భారత్ కు మాత్రమే ఉందని ఈ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

రష్యా మాత్రం ఈ యుద్ధంలో ఎవరు చెప్పినా.. ఎంత మంది విన్నవించినా వెనక్కి తగ్గడం లేదు. కైవ్, మరియపోల్ పై భీకర దాడులు చేస్తోంది. నగరం వదిలి సామాన్య ప్రజలు వలస పోతున్నారు.