Begin typing your search above and press return to search.

క్రికెట్ చూడను.. అతడెవరో గుర్తించలే.. పంత్ ను రక్షించిన డ్రైవర్

By:  Tupaki Desk   |   30 Dec 2022 12:30 PM GMT
క్రికెట్ చూడను.. అతడెవరో గుర్తించలే.. పంత్ ను రక్షించిన డ్రైవర్
X
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో ఆసక్తికర అంశం.. పంత్ నడుపుతున్న మెర్సిడెస్ కారు డివైడర్ ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకోగా ఆ సంఘటనను చూసినవారు ఎవరూ కారు తోలిన వ్యక్తి బతికి ఉంటాడని భావించి ఉండరు. అయితే, లక్ కొద్దీ పంత్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కాగా, పంత్ బ్యాటింగ్ ఎంత దూకుడో డ్రైవింగ్ కూడా దూకుడేనని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. కాస్త అదుపు తప్పి ఉంటే టీమిండియా కీలక క్రికెటర్ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. ఏదైతేనేం.. దేవుడి దయతో పంత్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. కాగా, ఈ దుర్ఘటన సమయంలో పంత్ ను రక్షించినది ఓ బస్ డ్రైవర్.

ఆట తెలియదు.. ఆటగాడెవరో తెలియదు

సంఘటన సమయంలో పంత్ కారు వేగంగా తోలుతున్నాడు. ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్ లోని రూర్కీ వెళ్తుండగా.. ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి ఓ బస్ డ్రైవర్. ''ప్రమాదం అనంతరం కారు మెర్సిడెస్ ఎస్ యూవీ నా బస్ కిందకు వస్తుందేమో అన్నంతగా గింగరాలు తిరిగింది.

అయితే, అలాంటిదేమీ జరగకుండానే ఆగిపోయింది'' అని హరియాణ రోడ్ వేస్ బ్రస్ డ్రైవర్ సుశీల్ మాన్ వెల్లడించాడు. కాగా, ప్రమాద సమయంలో కారు నుంచి పంత్ ను కొందరు బయటకు తీశారు. అంబులెన్స్ ను పిలిచి అందులో ఆస్పత్రికి తరలించారు. వీరిలో సుశీల్ మాన్ ఒకరు. అయితే, మాన్ క్రికెట్ చూడడట. దీంతో క్రికెటర్ పంత్ ఎవరో తెలియదని అతడు చెప్పాడు.

బస్ కు అవతలి దారిలో..

మాన్ చెప్పినదాని ప్రకారం.. జాతీయ రహదారిపై పంత్ నడుపుతున్న కారు అతి వేగంగా వెళ్తోంది. అటువైపు మార్గంలో మాన్ బస్ వెళ్తోంది. దీంతో పంత్ ఎంత వేగంగా వెళ్తూ డివైడర్ ను ఢీకొట్టినదీ మాన్ గమనించగలిగారు. ''ప్రమాదాన్ని ఊహించి బస్ ను పక్కకు పోనిచ్చా. అనంతరం వెంటనే డివైడర్ వద్దకు వెళ్లి కారులో ఏం జరుగుతుందో గమనించేందుకు వెళ్లా. కారు పల్టీలు కొట్టుకుంటూ వస్తుందేమోనని అనుకున్నా. ఇక కారులో చూస్తే తోలుతున్న వ్యక్తి సగం బయటకు వచ్చాడు'' అని మాన్ తెలిపాడు.

నేనే క్రికెటర్ ను..

ప్రమాదం అనంతరం కిటికీలోంచి అరుస్తూ పంత్ సాయం కోరినట్లు మాన్ చెప్పాడు. ''నేను క్రికెటర్ ను. మా అమ్మకు ఫోన్ చేయండి'' అని కోరాడని వివరించాడు. అయితే, పంత్ తల్లి ఫోన్ ఆ సమయంలో స్విచ్ఛాఫ్ వచ్చిందని తెలిపాడు. ''నేను క్రికెట్ చూడను కాబట్టి పంత్ ఎవరో తెలియదు. నాతో పాటు సాయపడేందుకు వచ్చిన మా బస్ లోని వారు మాత్రం పంత్ ను గుర్తించారు.

కారులోంచి అతడిని తీసిన తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారా? నీలం రంగులో ఉన్న అతడి బ్యాగ్ ను బయటకు తీశా. వాటిని అంబులెన్స్ కు ఇచ్చా'' అని మాన్ తెలిపాడు. కాగా, దేశమంతటికీ తెలిసిన యువ క్రికెటర్.. భవిష్యత్ లో కెప్టెన్ కాగల వ్యక్తిగా అందరూ భావిస్తున్న రిషభ్ పంత్ తెలియని వారు ఇంకా ఉన్నారని దీన్నిబట్టి తెలిసిపోతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.