Begin typing your search above and press return to search.

2019లో ‘ఆనం’ మీద ‘చిల్లర’ పోటీ?

By:  Tupaki Desk   |   14 Dec 2015 5:39 AM GMT
2019లో ‘ఆనం’ మీద ‘చిల్లర’ పోటీ?
X
బూతుల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడేసే విచిత్రమైన రాజకీయ నేత ఆనం వివేకానందరెడ్డిగా చెప్పొచ్చు. వేష.. భాషలు మొదలు ఆయన వేసే ప్రతి అడుగు విభిన్నంగా.. వివాదాస్పదంగా ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి బూతులు మాట్లాడేయటం.. ఛానల్ లో లైవ్ నడుస్తున్నా.. ఎలాంటి మొహమాటాల్లేకుండా బూతులతో మాట్లాడేందుకు అస్సలు మొహమాట పడరు. ఆయన గారు మాట్లాడే మాటల్ని వినే వారికి ముఖం పగిలిపోయినట్లు ఉంటుందే కానీ.. ఆయన మాత్రం అస్సలు ఫీలవ్వరు. ఒక్క మాటలే కాదు.. చేతలు కూడా అదే రీతిలో ఉంటాయి. ఇలాంటి వివేకానందరెడ్డికి.. వివాదాస్పద సినీ నిర్మాత చిల్లర కల్యాణ్ ఇద్దరికి మద్య ఒక భూ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆనం వివేకానందరెడ్డికి తనకు ఉన్న వివాదంపై పలు ఆసక్తికర విషయాలు చెప్పిన కల్యాణ్.. 2019లో తాను ఆనం వివేకానందరెడ్డి మీద పోటీ చేసినా చేస్తానంటూ కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తనకు.. వివేకానందరెడ్డికి మధ్య వివాదం మొదలైన అంశాన్ని చెప్పుకొచ్చారు.

కొద్ది సంవత్సరాల క్రితం నెల్లూరులో సుమారు ముప్పాతిక ఎకరం (అంకణాల్లో చెప్పుకొచ్చారు) కొన్నానని.. అప్పుట్లో రీజన్ బుల్ ధరకే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. తనకు అమ్మిన వ్యక్తి దగ్గరే సదరు ఆస్తి వందేళ్ల నుంచి ఉందని.. చేతులు మారలేదన్నారు. తాను కొనే నాటికి అంగన్ వాడీ స్కూల్ నడిచేదని చెప్పిన వివేక.. వాస్తవానికి ఆ స్థలాన్ని ఓల్డేజ్ హోమ్ కోసం వినియోగించాలని భావించినట్లుగా చెప్పారు.

అయితే.. ఆ భూమిని తన నుంచి దూరం చేయాలన్న ఉద్దేశంతో చాలానే చేశారని.. చివరకు మైనార్టీల పేరు చెప్పి వివాదం చేయాలని భావించినట్లుగా చెప్పారు. తనకు భూమి అమ్మింది ముస్లిం అని.. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా తానేదో మైనార్టీలకు చెందిన వక్ఫ్ భూమిని కబ్జా చేసినట్లుగా చెప్పుకుంటున్నారన్నారు. ప్రస్తుతం కోర్టులో ఈ వివాదం ఉందని.. కోర్టు తీర్పుతో తాను నిర్దోషినని.. కబ్జాకోరుకాదని తేలుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆనం ఫ్యామిలీతో పెట్టుకోవటం తన ఉద్దేశం కాదని.. తమ చిన్నతనంలో ఆనం వాళ్ల వర్గంలో ఉండేవాళ్లమని.. స్టూడెంట్ లైఫ్ లోనూ ఆనం వాళ్ల జట్టు కిందనే నడిచే వాళ్లమని.. ఇప్పుడదే ఫ్యామిలీతో వివాదాలొచ్చాయన్నారు.

ఈ వివాదంపై రాజీ చేసుకోవటం లేదని.. తాను నిర్దోషినని కోర్టు తేలిస్తే.. తన మీద ఆనం వివేక చేస్తున్న ఆరోపణలన్నీ తప్పులుగా తేలిపోతాయని చెప్పుకొచ్చారు. తన సొంత డబ్బుతో కొన్న భూమిని లాక్కునేందుకు ప్రయత్నించటమే కాదు.. తన మీద కబ్జాదారు అన్న ముద్ర వేయటంతో తాను ప్రెస్టేజ్ గా తీసుకున్నానని కల్యాణ్ చెప్పుకొచ్చారు.

నిజానికి తన మీద ఆరోపణలు చేస్తున్న ఆనం వాళ్ల ఆస్తులు చూడాలని.. వారి ఆస్తులన్నీ కబ్జాలేనని తేల్చారు. వారి ఆస్తులుగా చెబుతున్న ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలిస్తే.. వారి కబ్జా భాగోతమంతా బయటకు వస్తుందని చెప్పుకొచ్చారు. వారి కబ్జాల మీద తాను త్వరలో కోర్టుకు వెళతానని చెప్పిన కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో ఆనం వివేక మీద పోటీ చేస్తానన్నారు. ఏ పార్టీలో చేరతారన్న విషయంపై సూటిగా సమాధానం చెప్పని ఆయన.. ‘‘ఏమో.. అమ్మ జయలలిత పార్టీ అయిన అన్నా డీఎంకే తరఫున నెల్లూరులో పోటీ చేస్తానేమో’’ అంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి ఆనం వివేకాతో తనకున్న భూ తగదా.. చివరకు ఎన్నికల పోరుగా మారే అవకాశం ఉందన్న మాటను తాజా ఇంటర్వ్యూతో సి కల్యాణ్ స్పష్టం చేశారని చెప్పొచ్చు.