Begin typing your search above and press return to search.

విశాఖకు షిఫ్టింగ్ మీదనే క్యాబినెట్ మీటింగ్...?

By:  Tupaki Desk   |   8 Nov 2022 3:30 AM GMT
విశాఖకు షిఫ్టింగ్ మీదనే క్యాబినెట్ మీటింగ్...?
X
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల మూడవ వారంలో జరగనుందిని తెలుస్తోంది. ఈ సమావేశంలో అనేక అంశాలు ఉంటాయి. కానీ అతి పెద్ద ఫోకస్ గా విశాఖకు పరిపాలనాను తరలించే విషయమే ఉంటుంది అని ప్రచారం సాగుతోంది. విశాఖకు పాలనను తీసుకెళ్లాలని జగన్ చాలా కాలంగా అనుకుంటున్నారు. అయితే అనేక రకాలైన అడ్డంకులు, న్యాయపరంగా చూస్తే హై కోర్టు అమరావతే ఏకైక రాజధాని అని తేల్చిచెప్పేసింది. దాంతో దాని మీద అప్పీల్ కి ఏపీ సర్కార్ వెళ్లింది.

సుప్రీం కోర్టులో ఏ తీర్పు వస్తుందో తెలియదు. దానికి ఎంత కాలం పడుతుంది అన్నది కూడా తెలియదు. అయితే సుప్రీం కోర్టులో అమరావతి రాజధానికి సంబంధించి పిటిషన్ల విచారణ ఈ నెల 14 న జరగనుంది. ఆ విచారణ మొదలైన తరువాతనే మంత్రి వర్గ సమావేశాన్నినిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.

ఇక విశాఖకు షిఫ్టింగ్ అంటే కేవలం సీఎం క్యాంప్ ఆఫీస్ మాత్రమే వెళ్లాలా. లేక మంత్రులతో సహా ఒక మినీ సచివాలయమే వెళ్లాలా అన్న దాని మీదనే క్యాబినెట్ లో డిస్కషన్ చేస్తారు అని అంటున్నారు. నిజానికి విశాఖ షిఫ్టింగ్ కి పెద్దగా టైం లేదు. దాంతో సమయం చూస్తే ఎన్నికలకు దగ్గరపడుతోంది. మూడు రాజధానులు అంటూ గెలిచిన ఆరు నెలల తరువాత నుంచి వైసీపీ సర్కార్ స్లోగన్స్ ఇస్తున్నా తాడేపల్లి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. దాంతో ఎన్నికల ముందు అయినా విశాఖలో పాలన చేయకపోతే ఇక అది వట్టి నినాదం అవుతుంది అని కూడా వైసీపీ పెద్దలకు భయం ఉంది.

పైగా దానికి అల్లుకుని పొందాలనుకునే రాజకీయ లాభం వికటించి అసలుకే ఎసరు వస్తుంది అన్న కంగారూ వైసీపీకి ఉంది అంటున్నారు. మరో వైపు చూస్తే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు గడువు పట్టుమని పదిహేడు నెలలు కూడా లేవు. దాంతో అన్ని ముహూర్తాలూ గడచి అసలైన ఫైటింగ్ కి గడువు దగ్గరపడుతోంది. 2023 మే ముగిస్తే సర్కార్ నాలుగవ ఏడాదిలోకి ప్రవేశించినట్లు అవుతుంది. దాంతో అప్పటికి పూర్తిగా ఎన్నికల మూడ్ వచ్చేస్తుంది. దాంతో ఏం చేసినా 2023 మొదటి సగంలోనే చేయాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు.

ప్రస్తుతానికైతే వినిపిస్తున్న ప్రచారం బట్టి చూస్తే 2023 సంక్రాంతి తరువాత విశాఖకు షిఫ్ట్ కావాలని వైసీపీ ప్రభుత్వ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దాని కోసం ఏమి చేయాలి. ఏ రకంగా పాలనను అక్కడకి తరలించాలి అన్న దాని మీదనే త్వరలో జరగబోయే మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. క్యాబినెట్ మీటింగ్ ఎపుడు జరిగినా విశాఖ షిఫ్టింగ్ మీదనే సీరియస్ డికషన్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తలలో నిజమెంత ఉందో. 2023కైనా విశాఖ రావాలన్న జగన్ కోరిక తీరుతుందో లేదో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.