Begin typing your search above and press return to search.

వివేకా హత్య దర్యాప్తు పై చేతులెత్తేసిన సీబీఐ

By:  Tupaki Desk   |   20 May 2022 5:12 AM GMT
వివేకా హత్య దర్యాప్తు పై చేతులెత్తేసిన సీబీఐ
X
మాజీమంత్రి, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు విషయంలో సీబీఐ చేతులెత్తేసినట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. రెండు కారణాల వల్ల దర్యాప్తు ఎప్పటికి పూర్తవతుందో చెప్పలేమని సీబీఐ లాయర్ చెన్నకేశవులు స్ధానిక కోర్టు విచారణలో స్పష్టంగా చెప్పేశారు. లాయర్ చెప్పిన కారణాలు ఏమిటంటే హత్య కేసులకు సంబంధించి ఢిల్లీ, గాంధీనగర్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీల నుండి నివేదికలు రావటంలో ఆలస్యమవుతుందట.

అలాగే స్ధానిక అధికారుల నుండి సహకారం అందటంలేదట. ఈ రెండు కారణాల వల్ల దర్యాప్తు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని లాయర్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. తాను చెప్పిన వివరాలతో కోర్టుకు ఒక అఫిడవిట్ ను కూడా దాఖలు చేసినట్లు లాయర్ చెప్పారు. సీబీఐ అధికారుల వాహన డ్రైవర్ ను గుర్తుతెలీని వ్యక్తులు బెదిరించిన విషయాన్ని కూడా కోర్టుకు చెప్పామన్నారు.

హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని సీబీఐ లాయర్ చెప్పారు. అయితే సీబీఐ లాయర్ వాదనలపై న్యాయమూర్తి చీమలపాటి రవి జోక్యం చేసుకుంటూ నిందితులు దాఖలుచేసిన బెయిల్ పిటీషన్ పై విచారణను జూన్ 13వ తేదీకి వాయిదా వేశారు.

ఫోరెన్సిక్ నివేదికలు ఎప్పుడు వస్తాయో తెలీదని చెబుతున్న నేపథ్యంలో నిందితులకు బెయిల్ ఇవ్వకుండా ఎంతకాలం ఆపుతామన్న న్యాయమూర్తి ప్రశ్నకు సీబీఐ లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. అందుకనే ఫోరెన్సిక్ ల్యాబ్ లో నుంచి అవసరమైన నివేదికలను వీలైనంత తొందరగా తెప్పించాలని న్యాయమూర్తి సీబీఐ లాయర్ ను ఆదేశించారు.

నివేదికను తెప్పించటం సాధ్యపడకపోతే అప్పుడు కేసు మెరిట్ ఆధారంగా బెయిల్ పై విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టంగా చెప్పారు. కేసు దర్యాప్తు తీరును చూసిన తర్వాత హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దాదాపు చేతులెత్తేసిన ట్లు అర్థమైపోతోంది.