Begin typing your search above and press return to search.

టెలికాం ఆపరేటర్లకు కేంద్రం కీలక ఆదేశాలు..రెండేళ్లపాటు ఫోన్ కాల్స్, డేటా స్టోరేజ్

By:  Tupaki Desk   |   31 Jan 2022 7:49 AM GMT
టెలికాం ఆపరేటర్లకు కేంద్రం కీలక ఆదేశాలు..రెండేళ్లపాటు ఫోన్ కాల్స్, డేటా స్టోరేజ్
X
దేశ ప్రజల అంతర్గత విషయాలపై కేంద్రం పెత్తనాన్ని మరింత పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే ఆధార్,పాన్ ద్వారా సమాచారాన్ని మొత్తం గుప్పిట్లో ఉంచుకున్న ప్రభుత్వం మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వివరాల డేటాను కూడా సేకరిస్తోంది. ప్రజలు వినియోగించే మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ డేటాకు సంబంధించిన సమాచారం స్టోరేజీని ఇప్పటి వరకు సంవత్సరం వరకు మాత్రమే చేసేవారు.

కానీ తాజాగా మోదీ ప్రభుత్వం దీనిని మరో ఏడాదికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే టెలికాం సంబంధించిన డేటాను రెండేళ్లు భద్రపరుస్తుందన్నమాట. అయితే దీనిపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారి డేటాను సేకరించి వారిని తిప్పలు పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు.

అంతర్జాతీయ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, సాధారణ నెట్ వర్క్ లతో పాటు ఇంటర్నెట్లో పంపిన మెసేజ్ల వివరాలను కనీసం రెండేళ్ల పాటు భద్రపరచడాన్ని కేంద్రం తప్పని సరి చేసింది. ఈ మేరకు టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.

తాజా ఆదేశాల ప్రకారం ప్రతీ వ్యక్తి వినియోగించిన కాల్, ఇంటర్నెట్ డేటా రెండేళ్ల పాటు కేంద్రం ఆధీనంలో ఉంటుంది. అలాగే నెట్వర్క్ నుంచి కమర్షియల్ రికార్డ్స్, ఐపీ వివరాల పరిశీలన కోసం వీటిని స్టోర్ చేస్తుంది. అయితే ఆ తరువాత వీటితో ఉపయోగం లేదనుకున్న తరువాత డెలీట్ చేస్తారు.

వాయిస్ మెయిల్స్, ఆడియో టెక్ట్స్, యూనిఫైడ్ మెసేజింగ్ సేవలకు ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్ర ఆదేశించిన ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ లైసెన్సులు పొందిన టాటా కమ్యూనికేషన్స్, సిస్కోస్ వెబెక్స్, ఏటీ అండ్ టీ గ్లోబల్ నెట్ వర్క్ తదితర కంపెనీలకు కూడా ఈ సవరణ వర్తిస్తుందని తెలిపింది.

ఈ సవరణల ప్రకారం కాల్ వివరాల రికార్డులను భద్రపరచడాన్ని ఒక ఏడాది పొడగించడం సహా ఇంటర్నెట్ ప్రొటోకాల్ ను ఉపయోగించి చేసిన అంతర్జాతీయ కమ్యూనికేషన్ల వివరాలను భద్రపరచాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఉపగ్రహ ఆధారిత సేవలను అందించే వీ శాట్ లైసెన్స్ కలిగిన ఆపరేటర్లకు కూడా కనీసం రెండేళ్లపాటు కాల్ డేటా, ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ రికార్డులను నిల్వ చేయడాన్ని తప్పనిసరి చేసింది.

అయతే తాజా నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించనుందని అంటున్నారు. ప్రతీ వ్యక్తి కొన్ని పర్సనల్ చాట్స్, వాయిస్ మెయిల్స్ చేస్తారని, కానీ దీనిని కొందరు ఆసరాగా చేసుకొని వారిని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని అంటున్నారు.

అంతేకాకుండా బీజేపీ అధికారంలో ఉన్నందున తమకు సహకరించని, వ్యతిరేకంగా ఉన్న సంస్థలు, వ్యక్తులను బెదిరించడానికే ఈ విధానాన్ని తీసుకొచ్చారని విమర్శిస్తున్నారు. అయితే కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయంపై ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది.