Begin typing your search above and press return to search.

ఉచితాల మీద చెప్పాల్సిందే....సీఈసీ సంచలనం

By:  Tupaki Desk   |   4 Nov 2022 8:30 AM GMT
ఉచితాల మీద చెప్పాల్సిందే....సీఈసీ సంచలనం
X
కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ ఎన్నికల ప్రకటన వేళ కీలక కామెంట్స్ కొన్ని చేసింది. ఉచిత హామీలు ఇపుడు దేశంలోని అనేక పార్టీలు ఇస్తున్నాయని, వాటి విషయంలో హామీలు ఎలా తీరుస్తారు అన్నది తమకు చెప్పాలని ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాసినట్లుగా చెప్పారు. ఈ విధంగా చెప్పడం ఆయా పార్టీలు, అభ్యర్ధుల కనీస బాధ్యత సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు.

ఉచిత హామీలు ఇవ్వడం కాదు, వాటిని తీర్చడం కూడా బాధ్యత. ఎన్నికల మ్యానిఫెస్టో ఉన్నదే అందుకు. అందువల్ల హామీలు ఎలా తీరుస్తారు అన్నది కూడా ఇక్కడ ఇంకా ముఖ్యమని ఆయన అన్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలకు దీని మీద లేఖలు రాశామని చెప్పారు. ఉచిత హామీల వల్ల ప్రపంచంలో చాలా దేశాలు ఆర్ధికంగా ఇబ్బంది పడ్డాయని గుర్తి చేశారు. రాజకీయ పార్టీలు అభ్యర్ధులు కనుక ఉచిత హామీలు ఇస్తే వాటిని ఎలా తీరుతారు అన్నది ఓటర్లకు, ఆర్ధిక నిపుణులకు, మీడియాకు తెలియచెప్పాల్సిన అవసరం ఆయా రాజకీయ పార్టీలకు ఉంది అని సీఈసీ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తాజాగా వెలువడింది. కేంద్ర ఎన్నికల సంఘం 182 సీట్లు ఉన్న గుజరాత్ రాష్ట్రంలో రెండు విడతలుగా డిసెంబర్ 1, 5 తేదీలలో ఎన్నికలు నిర్వహించాలి నిర్ణయించింది. గుజరాత్ జనాభా చూస్తే 4.9 కోట్ల మంది ఉన్నారు.

వీరిలో ఈసారి కొత్తగా ఓటేయబోతున్న వారు 4.6 లక్షల మంది ఉన్నారు. ఎన్నికలు సాఫీగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు ఈసీ చేస్తోంది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ కి గత నెల 14న షెడ్యూల్ విడుదల చేసి గుజరాత్ కి ఆలస్యం చేయడాన్ని ఈసీ సమర్ధించుకుంది.

ఇందులో వేరే ఉద్దేశ్యాలు లేవని, ఎన్నికలు నిర్వహించడానికి తాము అక్కడి వాతావరణం, ప్రభుత్వాల కాలపరిమితి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎన్ని రోజులు ఉండాలన్నది కూడా గమనంలోకి తీసుకుంటామని చెప్పారు. అయితే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ కొద్ది రోజుల ముందే వెలువడి ఉండేది కానీ అక్కడ మోర్బీ తీగల వంతెన కూలిపోవడం వల్లనే ఆలస్యం అయినట్లుగా ఆయన చెప్పారు. మరో వైపు చూస్తే ఈ వంతెన ప్రమాదం ఎలా జరిగింది, 135 మంది ప్రాణాలు పోవడానికి గల కారణాలు ఏమిటి అన్న దాని మీద వేసిన విచారణ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలా వద్దా అన్నది ఆలోచిస్తున్నట్లుగా సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.

ఇక ఒక్క ఓటరు కోసం తాము పదిహేను మంది పోలింగ్ సిబ్బందిని గిర్ అడవులకు పంపిస్తున్నట్లుగా సీఈసీ చెప్పడం విశేషం. అలాగే మరో 272 మంది కోసం అలియాబెట్ లో ఒక షిప్ కంటైనర్ నే పోలింగ్ బూత్ గా వాడుతున్నట్లుగా చెప్పారు. కాగా గుజరాత్ లో 89 సీట్లకు డిసెంబర్ 1న 93 సీట్లకు డిసెంబర్ 5న ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సాఫీగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది అని వెల్లడించారు.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.