Begin typing your search above and press return to search.

క‌ష్ట‌కాలంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్!

By:  Tupaki Desk   |   11 Aug 2022 7:37 AM GMT
క‌ష్ట‌కాలంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్!
X
ఆర్థిక ఇబ్బందుల‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. ఏకంగా రూ.4,721 కోట్లను విడుద‌ల చేసింది. ప‌న్నుల వాటా కింద ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఈ మొత్తాన్ని ఇచ్చింది. గూడ్స్ అండ్ స‌ర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) కింద రాష్ట్రాల నుంచి వ‌సూలు చేసిన ప‌న్నుల్లో రాష్ట్ర వాటా కింద ఏపీకి కేంద్రం రూ.4,721 కోట్ల‌ను విడుద‌ల చేసింది. కాగా రెండో విడ‌త కింద ఈ మొత్తాన్ని కేంద్రం ఇచ్చింది.

కాగా తెలంగాణకు రూ.2452 కోట్లు విడుదల అయ్యాయి. దేశంలో అత్య‌ధికంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి రూ. 20,928.62 కోట్లు, బీహార్‌కు రూ. 11,734.22 కోట్లు వచ్చాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌కు రూ.3,974.82 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.9,158.24 కోట్లు, గుజరాత్‌కు రూ.4,057.64 కోట్లు, హరియాణాకు రూ. 1,275.14 కోట్లు, మహారాష్ట్రకు రూ.7,369.76 కోట్లు, రాజస్థాన్‌కు రూ.7,030.28 కోట్లు, తమిళనాడుకు రూ.4,758.78 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.8,776.76 కోట్ల నిధులు విడుదల అయ్యాయి.

కాగా తొలి వాటా కింద రూ.58,332.86 కోట్ల విడుదలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం రెండు విడతలు కలిపి రూ.1,16,665.75 కోట్లను రాష్ట్రాలకు విడుదల చేసిందని కేంద్ర‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ వ‌ర్గాలు తెలిపాయి.

ఈ మొత్తాల‌తో రాష్ట్రాలు తమ మూలధనం, అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేయడానికి, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయ‌డానికి వినియోగిస్తాయ‌ని కేంద్రం భావిస్తోంద‌ని ఆర్థిక శాఖ చెబుతోంది.

కాగా ఏపీకి 4,721 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేసిన‌ప్ప‌టికీ.. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన‌ అనేక నిధులు ఏడాది కాలంగా పెండింగ్ లోనే ఉన్నాయంటున్నారు. స్థానిక సంస్థలకు ఇంతవరకూ గత ఏడాది రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదని ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

గ్రామ పంచాయతీలకు 678.65 కోట్లు, మండల ప‌రిష‌త్, జిల్లా పరిషత్ లకు 290. 86 కోట్లు బకాయిలు విడుద‌ల కావాల్సి ఉంద‌ని చెబుతున్నారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి విడతలో 1,000 కోట్ల రూపాయ‌లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని అంటున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బ‌కాయిల గురించి ప‌లుమార్లు కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద ప్ర‌స్తావించింద‌ని పేర్కొంటున్నారు.