Begin typing your search above and press return to search.

మోడీపై మైసూరా ఫైర్

By:  Tupaki Desk   |   19 Dec 2016 7:39 AM GMT
మోడీపై మైసూరా ఫైర్
X

పెద్ద నోట్ల రద్దు వల్ల కలుగుతున్న కష్టాలపై సీనియర్ నేత మైసూరారెడ్డి మండిపడ్డారు. మోడీ ఒక విఫల ప్రయోగం చేసి ప్రజల జీవితాలతో ఆటాడుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు... మైసూరా బ్రహ్మాండమైన లాజిక్ ఒకటి తీశారు. ఎవరైనా ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే కేసు పెడతామని ... అలాంటిది ఇప్పుడు ఖాతాల్లోని డబ్బును తిరిగి చెల్లించని బ్యాంకులు - ఆర్‌ బీఐపై ఎందుకు కేసులు పెట్టకూడదని ఆయన ప్రశ్నించారు.

పెద్ద నోట్ల రద్దుతో ఏదో చేసేస్తానని ప్రధాని మోదీ ప్రగల్బాలు పలికారని … కానీ చివరకు ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీశారని మైసూరారెడ్డి విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో నాలుగు లక్షల కోట్లు మిగులుతాయని… ఆ డబ్బుతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని మోదీ చెప్పారని ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. ఇప్పటికే 14 లక్షల కోట్లు బ్యాంకులకు వచ్చిపడిందని… నల్లధనం కూడా తెల్లధనంగా మారిపోయిందన్నారు. మోదీ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు విపరీతమైన ఇబ్బందిపడుతున్నారని మైసూరా అన్నారు.

సంపాదించుకున్న డబ్బు కోసం ఎటీఎంలు - బ్యాంకుల వద్ద జనం పాకులాడాల్సిన దుస్థితిని మోదీ తెచ్చారన్నారు. మోదీ అతి పెద్ద వల విసిరినప్పటికీ చేపలుగానీ, తిమింగలాలు గానీ పడలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు ప్రకటన ఉపసంహరించుకున్నా ఉపయోగం లేదన్నారు. పరిస్థితి చేయి దాటిపోయిందన్నారు. నోట్ల రద్దుపై ప్రజల తరపున తాను హైకోర్టులో పిటిషన్ వేసినట్టు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/