Begin typing your search above and press return to search.

జగన్ పరువు తీసిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   17 Oct 2022 11:31 AM GMT
జగన్ పరువు తీసిన చంద్రబాబు
X
ఏపీకి మూడు రాజధానులు కడతానంటోన్న జగన్.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు కూడా వేయించలేకపోతున్నారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరకు పలువురు నేతలు పలుమార్లు దుయ్యబట్టారు.

అయినా సరే జగన్ తీరు మాత్రం మారడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని రోడ్ల దుస్థితిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ చేసిన ట్వీట్ ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది.

అనకాపల్లిలోని రోడ్ల దుస్థితి ఇదని, జగన్ అభివృద్ధి మోడల్ అంటే ఇదేనా? అంటూ జగన్ పాలనను మురళీధరన్ విమర్శించారు. ఈ రోడ్లపై ప్రయాణించడం ఒక శిక్ష అని, ప్రజల ప్రాథమిక అవసరాలు, మౌలిక సదుపాయాలను కూడా జగన్ పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వెళ్లేందుకు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలని, దానికి గంటకు పైగా సమయం పట్టడం సిగ్గుచేటని మురళీధరన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.

ఈ క్రమంలోనే మురళీధరన్ ట్వీట్ ను చంద్రబాబు రీ ట్వీట్ చేస్తూ...జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. జగన్ పాలన కేంద్ర మంత్రుల దృష్టికి సైతం వెళ్లిందని, అయితే, అది ఉత్తమ పాలసీలు చూసో, బెస్ట్ రిజల్ట్స్ చూసో కాదని... మూడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజలకు నరకం చూపుతున్న రోడ్లను చూసి అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

వైసీపీ ప్రభుత్వానికి ఇది సిగ్గుగా అనిపించడం లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రోడ్ల మరమ్మతులపై ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నా...ప్రజలు మాత్రం రోడ్డు దాటలేకపోతున్నారని చంద్రబాబు చురకలంటించారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.