Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో 'చండ్ర' నిప్పులు

By:  Tupaki Desk   |   17 March 2015 1:21 PM IST
అసెంబ్లీలో చండ్ర నిప్పులు
X
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బాగా వేడివేడిగా ఉంది. సీఎం చంద్రబాబు మంగళవారం మునుపెన్నడూ లేనిస్థాయిలో ఆగ్రహానికి, ఆవేశానికి గురై శాసనసభలో బాగా స్పీడయ్యారు. తీవ్రంగా మాట్లాడినా ఎన్నడూ పరుషంగా మాట్లాడని చంద్రబాబు నోటినుంచి కొన్ని తీవ్రమైన పదాలు కూడా వినిపించాయి. ''పిచ్చిపిచ్చి వేషాలేయొద్దు''.. ''ఇల్లనుకున్నారా... సభనుకున్నారా... మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను... వెంటాడుతా'' అంటూ దాదాపుగా బెదిరించినంత పని చేశారు. ఆగ్రహంతో ఊగిపోతూ ఆయన మాట్లాతుతున్న తీరు చూసి స్పీకర్‌ కోడెల మౌనం వహించారు. చంద్రబాబు కోపం చూసినవారంతా ఈయన ఆ చంద్రబాబేనా అని ఆశ్చర్యపోయే స్థాయిలో ఆయన మాట్లాడారు.

జగన్‌ పట్టిసీమ అంశంపై మాట్లాడుతుండగా తొలుత ఒకసారి అడ్డుకున్న చంద్రబాబు రెండోసారి కూడా జగన్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆ సందర్భంలో ఆయన ఎప్పుడూ లేనంత ఆగ్రహానికి గురాయ్యారు. సాక్షి పత్రికను, జగన్‌ను, వైసీపీని కడిగిపారేశారు. ''రౌడీయిజం చేస్తానంటే కుదరదు... పిచ్చిగా చేస్తే ప్రజల్లోకి వెళ్లలేరు... మిమ్మల్ని వదిలిపెట్టను'' అంటూ ఆవేశపడ్డారు. చంద్రబాబు కూర్చున్న వెంటనే మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, రావెలతో పాటు ఇతర సభ్యులు కూడా జగన్‌, వైసీపీలపై ఫైరయ్యారు. రోజూ మాదిరిగానే ''తొలిసారి వచ్చారు... మీకేం తెలియదు'' అంటూ జగన్‌ను బచ్చాను చేసి మాట్లాడుతూ సైకలాజికల్‌ గేమ్‌ ఆడేందుకు టీడీపీ ప్రయత్నించింది. మొత్తానికి శాసనసభలో వైసీపీపై టీడీపీ పూర్తిస్థాయిలో పైచేయి సాధించి జగన్‌ను కార్నర్‌ చేయడంలో సఫలమైంది.