Begin typing your search above and press return to search.

ఆనంను ఏడిపించిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   20 Feb 2017 6:06 AM GMT
ఆనంను ఏడిపించిన చంద్రబాబు
X
నెల్లూరు కాంగ్రెస్ పార్టీలో ఆనం బ్రదర్సు ఉండేటప్పుడు వారిని మించిన తోపుల్లేరు.. ఏదైనా పనిచేయాలన్నా.. కాంట్రాక్టులు ఇవ్వాలన్నా, పదవులు రావాలన్నా.. దేనికైనా వారి దయ ఉండాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ వంటి కీలక పదవులు సొంతం చేసుకున్న స్టేటస్. కానీ... టీడీపీలోకి వచ్చిన తరువాత సీనంతా మారిపోయింది. వారే ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. టీడీపీలో చేరినప్పుడు చంద్రబాబు వారికి ఇస్తామని చెప్పిన పదవులు కూడా దక్కకపోవడంతో ఆనం బ్రదర్సు వర్గంలో అసంతృప్తి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా అనం వివేకా అయితే చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినా ఇప్పుడు నో వేకెన్సీ బోర్డు చూపించడంతో ఆయన దాన్ని అవమానంగా ఫీలయి కంటతడి పెట్టుకున్నారు. అంతేకాదు... టీడీపీలో చేరడం తమ రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటలో టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినా టీడీపీ అధిష్టానం నుంచి ఆమోదం దొరక్కపోవడంతో ఆనం వివేకా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇవ్వకపోవడం ఒకెత్తయితే... పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీని గుర్తుచేసినందుకు చంద్రబాబు తమపై ఆగ్రహించడం ఇంకా దారుణమని వారు ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్‌ కోసం తనను కలిసిన ఆనం సోదరులపై చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నమ్మకంతో పార్టీలోకి ఆహ్వానిస్తే, పార్టీకి నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని సీఎం మండిపడినట్లు తెలిసింది. రామ నారాయణరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే టికెట్‌ - వివేకాకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ సీటు, తనయుడికి ఎమ్మెల్యే టికెట్‌ వారు ఆశిస్తున్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జి పదవి ఇచ్చి పండగ చేసుకోమని చెప్పేశారు.

ఎమ్మెల్సీ సీటు కోసం ఆనం వివేకాందరెడ్డి స్వయంగా చంద్రబాబు వద్ద కు వెళ్తే రెండు రోజుల పాటు అపాయింటుమెంటే దొరకలేదట. దీంతో ఆయన రెండు రోజులు విజయవాడలో బస చేసి చివరికి 2 నిమిషాలు మాట్లాడే అవకాశం దక్కించుకున్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే చంద్రబాబునాయుడు ఇప్పటికే రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ చార్జిగా అవకాశం కల్పించామని... ఏం ఇవ్వాలో ఏం ఇవ్వొద్దో తనకు తెలుసని తేల్చిచెప్పినట్లు టాక్. దీంతో అమరావతి నుంచి తిరిగొచ్చాక ప్రెస్ మీట్ పెట్టిన ఆనం వివేకా ఏకంగా కన్నీరు పెట్టారు. పదవుల్లేకపోతే పోయింది తమ సోదరుల మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/