Begin typing your search above and press return to search.

చంద్ర‌గిరిని ప‌ట్టించుకోని బాబు..

By:  Tupaki Desk   |   7 Jan 2018 4:33 PM GMT
చంద్ర‌గిరిని ప‌ట్టించుకోని బాబు..
X
తాను పుట్టిన ఊరు - చదివిన పాఠశాలలపై కూడా అనుబంధం లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టమని వైసీపీ అధినేత‌ - ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రగిరిని పట్టించుకోని సీఎం చంద్రబాబు.. ఇప్పుడు సింగపూర్‌ కడతానని ప్రజల్నిమభ్యపెడుతుండటం దారుణమని ఆయ‌న వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఎలాంటి అనుబంధాలు ఉండవనీ - ఆయనకు కావాల్సింది రాజకీయాలే అని - అందుకు పిల్లనిచ్చినా మామనైన సరే మరెవరైనా సరే వదిలిపెట్టకుండా వెన్నుపోటు పొడవడమే ఆయన నైజమని తూర్పారపట్టారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత - ఆదివారం చంద్రగిరి నియోజకవర్గం దామల చెరువులో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టారు. పాదయాత్రలో భాగంగా వేలాది మంది తన అడుగులో అడుగు వేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వేలాది మంది కష్టాలు చెప్పుకుంటూ - తన భుజం తడుతూ - వెంట ఉంటామని ధైర్యమిస్తూ నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

సాక్షాత్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన ప్రాంతమైన చంద్రగిరి నియోజకవర్గంలోని పరిస్థితులను ఒకసారి చూడండంటూ అక్కడి దుస్థితిని జ‌గ‌న్ వివరించారు. `1977 చంద్రబాబు ఇక్కడి నుంచే కాంగ్రెస్ తరరున పోటీ చేశారు, 2500 ఓట్లతో గెలిచారు. అప్పట్లో నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యాన మంత్రి కూడా అయ్యారు. 1983 లో మంత్రిగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.17400 పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. ఆయన పనితీరుకు అప్పట్లోనే ప్రజలు గుణపాఠం చెప్పారంటేనే - ఎంత గొప్పగా చంద్రగిరిని అభివృద్ధి పథంలో నడిపించారో తెలుస్తోంది. ఆ తరువాత మంత్రి పదవిని ఇచ్చిన కాంగ్రెస్ ను వదిలేసి మామగారి పార్టీలో చేరారన్నారు. మామతో కూడా నిజాయితీగా పనిచేయలేదు. ఓడిపోయి చచ్చిన పాములా ఉన్న వ్యక్తిని మామ ఎన్టీఆర్ ఆదరించారు. ఆశీర్వదించి - ఆదరించిన మామనూ చంద్రబాబు వదిలిపెట్టలేదు - అధికారం కోసం - రాజకీయం కోసం అధికారం కోసం కూతురినిచ్చిన సొంత మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి రాష్ట్ర ప్రజలు ఒక లెక్కనా ?` అని జ‌గ‌న్ ప్రశ్నించారు. `అవసరముంటే ఎవరి కాళ్లైనా పట్టుకుంటారు - అవసరం తీరిపోయాక - ఎవరినైనా సరే వెన్నుపోటు పొడుస్తారు ఇది చంద్రబాబు నాయుడి చరిత్ర మనమంతా చూశామని జగన్ వివరించారు.

చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు పుట్టిన గడ్డమీదనే - ముఖ్యమంత్రిగా గతంలో 9 ఏళ్లు - ఇప్పుడూ మళ్లీ 4 ఏళ్లుగా ఉన్నా ఇక్కడున్న పరిస్థితులు ఆశ్చర్యకరంగా ఉన్నాయంటూ ఒక్కొక్కటిగా అంశాలను జగన్ ప్రస్తావించారు. `బాబు చదువుకున్న శేషాపురం స్కూలు శిథిలావస్థలో ఉంద‌ని చాలా మంది చెప్పారు. పుట్టిన ఊరి మీద - చదివిన స్కూల్ మీద కొద్దో గొప్పో ప్రేమ లేని వ్యక్తి - ముఖ్యమంత్రిగా ఉన్నారంటే రాష్ట్రంలోని స్కూళ్లపై ప్రే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో నాన్న హయాంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన చనిపోయిన తరువాత మర్చిపోయారు. చంద్రబాబు గారి వచ్చిన తరువాతైనా ఎక్కడైనా కనిపించిందా? ఉత్తర్వులు ఇచ్చినా కనిపించని దుర్భర పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గంలో 138 పంచాయితీలు ఉన్నాయి, దాదాపు 70 శాతం పలెల్లో తాగడానికి నీళ్లు లేవు. సాగుకు - తాగుకు నీళ్లుని పరిస్థితి ఉందంటే సొంత ఊరుపై చంద్రబాబుకున్న ప్రేమ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు కానీ సొంత ఊరిలో మాత్రం వసతులు కల్పించరు` అంటూ బాబు వైనాన్ని ఎండగట్టారు. `ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే పేదలకు ఇళ్లు కట్టరు - ఫించన్లు ఇవ్వరు - రేషన్ కార్డు ఇవ్వరు - చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు తీసుకునే వ్యవస్థను తయారు చేశారు తప్ప - ఒక్కరికీ కూడా ప్రయోజనం కల్పించలేదు` అని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

చంద్ర‌బాబు నాలుగేళ్ల పాలనలో అవినీతిని ఎలా జరుగుతుంతో చెప్పాల్సిన పనిలేదని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. `మట్టి - ఇసుకుని చూసినా అవినీతి మయమే. బొగ్గులు - కరెంటు కొనుగోళ్లు - కాంట్రాక్టర్లు - రాజధాని భూములు - గుడి భూములు ప్రతిదానిలోనే అవినీతే వేటినీ వదిలిపెట్టలేదు. విచ్చలవిడిగా అవినీతి సాగిస్తున్నారు. బాబు లెవల్లో ఆయన స్థాయిలో - కిందమో జన్మభూమి కమిటీలో పేరుతో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వారిని దోచుకోమని గ్రామల మీద వదిలేశారు. ఫించను కావాలాన్నా - చివరకు మరుగుదొడ్లు కావాలన్న లంచాలు తీసుకుని దుస్థితి నెలకొంది.` ఇచ్చిన హామీలు - చేసిన ప్రకటనల గురించి ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తిని ప్రజలు అడిగితే - తమాషా పడతా ఉన్నారా - తాటతీస్తా అని బెదిరిస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆక్షేపించారు. ఇంతటి స్థాయిలో ప్రజలపై దుర్బాష్యాలాడుతున్న వారి కళ్లు ఎక్కడున్నాయో అర్ధం అవుతోందన్నారు. `నాలుగేళ్లు అయిపోయింది - సంవత్సరంలో ఎన్నికలు జరగబోతాయో ఈ పెద్దమనిషే చెపుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలాంటి వారు కావాలో నిర్ణయించుకోవాలి.` అని జ‌గ‌న్ సూచించారు.