Begin typing your search above and press return to search.

కాలిపోయాక ఎంత కవర్ చేస్తే లాభమేంది బాబు

By:  Tupaki Desk   |   8 Sep 2016 10:30 PM GMT
కాలిపోయాక ఎంత కవర్ చేస్తే లాభమేంది బాబు
X
కొన్ని అవకాశాలు.. సందర్భాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి సందర్భంగా కాస్త ఆలస్యంగా స్పందించినా ఎవరూ ఏమీ అనుకోరు. కానీ.. మెరుపు వేగంతో స్పందించారన్నట్లుగా వ్యవహరించటం కొన్నిసార్లు మొదటికే మోసం వచ్చే పరిస్థితి. ఊరించి.. ఊరించిన తర్వాత ఏపీకి ఏదో అద్భుతాన్ని అందిస్తున్నట్లుగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెనువెంటనే రియాక్ట్ అయ్యారు. ఇప్పుడదే ఆయన పాలిట శాఫమైంది.

తన ప్రెస్ మీట్ నుంచి ఎంతో ఆశించిన సీమాంధ్రులకు చంద్రబాబు మాటలు కాలేలా చేసింది. దీనికి సంబంధించిన ఫ్యీడ్ బ్యాక్ బాబుకు సరిగా అందలేదనే చెప్పాలి. ఎప్పుడైతే ఏపీ అసెంబ్లీలో ఏపీ విపక్షం విరుచుకుపడటంతో జైట్లీ ప్యాకేజీ ప్రకటన తర్వాత తన ప్రెస్ మీట్ మీద ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందన్నఅంశంపై ఆరా ఏపీ అధికారపక్షంలో మొదలైంది. జైట్లీ ప్యాకేజీ మీద అధినేత స్పందన సర్కారుకు నెగిటివ్ గా మారిందన్న విషయం అర్థం చేసుకున్న బాబు.. డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా రాష్ట్రం పట్ల.. హోదా అంశంలో తనకున్న కమిట్ మెంట్ ను వివరించే ప్రయత్నం చేశారు.

ఇందుకు అసెంబ్లీ వేదికగా చేసుకోలేని నేపథ్యంలో.. శాసనమండలిని ఆయన ఉపయోగించుకున్నారు. ఏపీ హోదా అంశం మీదా.. జైట్లీ ప్యాకేజీ మీద తన విధానాన్ని స్పష్టం చేయటంతో పాటు.. తన వ్యూహం కాస్త భిన్నంగా ఉంటుందంటూ ఆయన నోటి వెంట సర్దిచెప్పే మాటలు రావటం గమనార్హం. శాసనమండలిలో సుదీర్ఘ ప్రకటన చేసిన ఆయన.. ఏపీ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూశారని.. ఇందుకోసం గ్రీన్ ట్రిబ్యునల్ తో ఆపాలని అనుకున్నట్లుగా చెప్పారు.

జీవితంలో రాజీ పడేది లేదని.. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 70:30 శాతం నిధులు ఇస్తామన్నారని.. ఇప్పుడు మొత్తం నిధులు కేంద్రమే ఇస్తానంటోందని చెప్పటం గమనార్హం. తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని.. తనకంటూ కొన్ని వ్యూహాలు ఉంటాయని చెప్పిన చంద్రబాబు.. 14వ ఆర్థిక సంఘం ప్రకారం హోదా ఇవ్వలేకపోతున్నట్లు చెప్పారని.. దాంతో మనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా ఇవ్వలేమని.. కాకుంటే అదే స్థాయిలో ప్రయోజనాలు ఇస్తామని చెప్పారన్నారు. డబ్బుల్లేవుకాబట్టి ఇప్పుడు ఇచ్చింది తీసుకుంటామని.. రావాల్సినవి అడుగుతూనే ఉంటామని.. కేంద్రాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. ఇచ్చింది తీసుకోకుండా మనం ఏదైనా చేస్తే నష్టపోతామన్నారు. వాజ్ పేయ్ సర్కారులో చేరాలని.. మంత్రిపదవులు తీసుకోవాలని ఎంతగా బతిమిలాడినా తీసుకోలేదన్న విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. భాగస్వామ్యం ఉండాలని చెబితే స్పీకర్ గా బాలయోగిని చేస్తూ ఓకే అన్నామని చెప్పుకొచ్చారు. జనాలు మాంచి కాక మీద ఉన్నప్పుడు చెప్పిన మాటలే కమిట్ మెంట్ కు ప్రాతిపదిక అవుతాయే తప్పించి.. ఇప్పడెంత కవర్ చేసినా కవర్ అవదన్న విషయం బాబుకు ఎప్పటికి అర్థమవుతుందో..?