Begin typing your search above and press return to search.

హోదా.. రైల్వే జోన్.. సస్పెన్స్ వీడిపోతుందా?

By:  Tupaki Desk   |   7 Sept 2016 4:51 PM IST
హోదా.. రైల్వే జోన్.. సస్పెన్స్ వీడిపోతుందా?
X
ఈ రోజు ఉన్నట్లుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలజడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా.. రైల్వే జోన్ తదితర హామీలపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చేయబోతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరుస భేటీలతో ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఢిల్లీ నుంచి పిలుపు కూడా వచ్చింది. కొంతసేపటి కిందటే చంద్రబాబుకు వెంకయ్య నాయుడు ఫోన్‌ చేసి.. వెంటనే బయల్దేరి ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

హోదా బదులు కేంద్రం అందుకు సమానమైన ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేసిందని..అందులోని అంశాలను చంద్రబాబుకు వివరించేందుకే వెంకయ్య ఢిల్లీకి రమ్మన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సమక్షంలోనే ప్యాకేజీ విషయంలో ప్రకటన చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భావిస్తున్నట్లు సమాచారం. పీఎంవో కార్యాలయంలో ప్యాకేజీపై సంప్రదింపుల అనంతరం సాయంత్రానికి ప్రకటన వెలువడే అవకాశముంది.

ఐతే ప్యాకేజీ గురించి వస్తున్న వార్తలపై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకూ ప్యాకేజి ఇస్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. ఈ విషయంలో వేరే ఆలోచన లేదన్నారు. విశాఖకు రైల్వే‌జోన్‌ ఇవ్వడం లేదని కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని ఆయన చెప్పారు. మరోవైపు విశాఖకు రావాల్సిన రైల్వే జోన్ ను విజయవాడకు తరలిస్తున్నట్లు.. ఈ మేరకు ప్రకటన రాబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.