Begin typing your search above and press return to search.

ఢిల్లీలో కొత్త పైరవీల్లో చంద్రబాబు దూతలు బిజీ

By:  Tupaki Desk   |   22 Aug 2016 10:30 PM GMT
ఢిల్లీలో కొత్త పైరవీల్లో చంద్రబాబు దూతలు బిజీ
X
చంద్రబాబునాయుడుకు సంబంధించిన దూతలు ఢిల్లీలో తమ పైరవీలు షురూ చేస్తున్నారనగానే.. అక్కడేదో ప్రత్యేకహోదా కోసం వీరు కష్టపడిపోతున్నారని అనుకుంటే.. పొరబాటే. చంద్రబాబు తన ఒళ్లు కాపాడుకునే ఒక ప్రయత్నం కోసం ఇప్పుడు ఢిల్లీలోని తన దూతల్ని పురమాయించారుట.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన భాజపా కోర్‌ కమిటీ సమావేశం మంగళవారం నాడు ఢిల్లీలో జరగబోతోంది. స్వయంగా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆధ్వర్యంలోనే సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశంలోనైనా.. ఏపీ భాజపాకు కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉండవచ్చుననే ఊహాగానాలు పుష్కలంగా ఉన్నాయి. నిజానికి ఢిల్లీలో ఏపీ భాజపా కోర్‌ కమిటీ మీటింగులు జరిగే ప్రతిసారీ.. ఇక్కడ చంద్రబాబునాయుడుకు గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయని.. నాయకులు అంటుంటారు. ఎందుకంటే.. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించేస్తారేమో.. ఆ పదవిని ఎవరి చేతుల్లో పెడతారో ఏమో అని ఆయన ఆందోళన చెందుతుంటారుట.

ఒక రకంగా చూస్తే.. చంద్రబాబు ను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆయన సర్కారు పాలన మీద విమర్శలతో చీల్చిచెండాడేస్తున్న సోము వీర్రాజు - పురందేశ్వరి లాంటి వారే ఏపీ భాజపా సారథ్య రేసులో ఉన్నారు. అయితే ఇలాంటి ఫైర్‌ బ్రాండ్‌ లలో ఎవరికి పదవి దక్కినా తనకు స్థానికంగా చుక్కలు చూపిస్తారనేది చంద్రబాబులోని భయం. అందుకే వారికి పదవులు దక్కకుండా ప్రతిసారీ ఆయన ఢిల్లీలోని తన దూతల ద్వారా భాజపా హైకమాండ్‌ వద్ద లాబీయింగ్‌ చేస్తుంటారని అనేక పుకార్లున్నాయి. ఇప్పుడు కూడా ఆ పుకార్లే వినిపిస్తున్నాయి. అయినా ప్రస్తుత అధ్యక్షుడి పదవీ కాలం పూర్తయి నెలల గడచిపోతున్నా, కేంద్ర నాయకత్వం కొత్త సారథ్యం ఎంపిక పై నిర్ణయం తీసుకోకపోవడం చూస్తోంటే చంద్రబాబు ప్రభావమే అని పలువురు అనుకుంటున్నారు.