Begin typing your search above and press return to search.

బాబు స్పంద‌న:శంకుస్థాప‌న విమ‌ర్శ‌లు అందుకే

By:  Tupaki Desk   |   23 Oct 2015 4:07 PM GMT
బాబు స్పంద‌న:శంకుస్థాప‌న విమ‌ర్శ‌లు అందుకే
X
అమరావతి శంకుస్థాపన మహోత్సవం పూర్త‌యిన సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క్ర‌మం జ‌రిగిన తీరు, ఆ స‌మ‌యంలో వ‌చ్చిన స్పంద‌న‌, అనంత‌రం ప్ర‌తిప‌క్షాలు వ్య‌వ‌హ‌రించిన తీరుపై బాబు స్పందించారు.

రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారని బాబు కొనియాడారు. ఒక మహా యజ్ణంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించామ‌ని, ఇందుకు రాష్ట్ర ప్రజలు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు సహకరించడ‌మే కాకుండా కష్టపడ్డారని చంద్రబాబు చెప్పారు.కేంద్ర ప్ర‌భుత్వ‌ సాయం గురించి విపక్షాలు చేస్తున్నదంతా అనవసర రాద్ధాంతమేనని చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించాల్సిన సహకారంపై తీసుకోవలసిన చర్యలు, ఏంత సహాయం చేయాలి అన్న అంశాలను పరిశీలించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ నీతీ ఆయోగ్ ను ఆదేశించారనీ, త్వరలో నీతి ఆయోగ్ నివేదిక వస్తుందని చంద్రబాబు చెప్పారు.

ఏపీ ప్రత్యేక హోదా...ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరుతున్నామని, అందులో తప్పేముందని చంద్ర‌బాబు ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలనూ తు.చ తప్పకుండా అమలు చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ విస్పష్టంగా వేదికపై ప్రకటించారన్నారు. అంతే కాకుండా మోడీ - చంద్రబాబు జోడీ ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామని మోడీ చెప్పారనీ, ఇందులో తప్పుపట్టడానికి, విమర్శించడానికి ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చేసిన వారు, రాజధాని వద్దనుకున్న వాళ్లు చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించి తీరుతామని పునరుద్ఘాటించారు. పొరుగు రాష్ట్రాలతో సమానమైన ఆర్థిక స్థాయి వచ్చే వరకూ సహకరించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.