Begin typing your search above and press return to search.

బాబు ఫైన‌ల్ రివ్యూలో ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   19 Oct 2015 3:57 PM GMT
బాబు ఫైన‌ల్ రివ్యూలో ఏం చెప్పారు?
X
న‌వ్యాంద్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమ‌రావ‌తి శంఖుస్థాపన కార్యక్రమానికి రెండ్రోజులే గ‌డువు ఉన్న నేప‌థ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ర్ట ఉన్న‌తాధికారుల‌తో ఏర్పాట్ల‌పై తుది స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. పోలీస్ - రెవిన్యూ - దేవాదాయ - మున్సిపల్ తదితర శాఖల అధికారులతో తన కార్యాలయంలో సమీక్షించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ - భద్రతా ఏర్పాట్లపై డీజీపీ రాముడు - ఉన్న‌తాధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. గుంటూరు - విజయవాడ నుంచి వచ్చే వాహనాలకు చేసిన పార్కింగ్ వివరాలను ముఖ్యమంత్రికి తెలిపారు. ఉదయం 8 గంటలనుంచి 12 గంటల వరకు వేదిక వైపు దారితీసే మార్గాలన్నీ వన్ వే చేశామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు 8,331 మంది పోలీసులతో విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. అవసరమైన ప్రాంతాలలో వినియోగించేందుకుగాను 14 క్రేన్లను కూడా సిద్దంగా ఉంచామన్నారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ శంఖుస్థాప‌న‌ సంబ‌రం రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిందని అన్నారు. శంఖుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీ రానున్న నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లలో ఎటువంటి గందరగోళానికి తావివ్వకుండా కార్యక్రమం మొత్తం సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ‘ మన నీరు-మన మట్టి-మన అమరావతి’ - ‘అమరావతి సంకల్ప జ్యోతి’ కార్యక్రమాలు - పవిత్ర కలశాలు ఉంచిన వాహనాలకు ముందుగా టీటీడీ ప్రచార రథం - తరువాత దేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాల ప్రచార రథాలు - అనంతరం రాష్ట్రంలోని 6 ప్రసిద్ద దేవాలయాల రథాలు ఉండాల‌ని తెలిపారు. వాటి త‌ర్వాత మ‌హనీయుల జన్మస్థలాల నుంచి వచ్చిన రథాలు - 13 జిల్లాల ప్రచార రథాలు వరుస క్రమంలో ఒక ర్యాలీగా రాజధాని ప్రాంతానికి తరలిరావాలని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో 16వేల గ్రామాలు,వార్డుల ప్రజల పూజాఫలం - వేలాది గ్రామదేవతల ఆశీస్సులు - 33 పుణ్యనదుల పవిత్రజలాలు - మహనీయుల జన్మస్థలాలనుంచి సేకరించిన మట్టి - నీటి స్పూర్తి రాజధానికి కలకాలం రక్షాకవచంగా మారుతుందన్నారు.

విజయవాడ నగరం శోభాయమానంగా అలంకరించాలని, ఏర్పాట్లపై ఒక బ్రోచర్ ను తయారుచేయాలని, వీడియో సీడీని రూపొందించాల‌ని బాబు ఆదేశించారు. అతిథులు ఎవరికీ ఇబ్బంది రాకూడదని, అసౌకర్యం కలగకూడదని సూచించారు. దీంతోపాటు ఆ రోజు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటుందని కూడా అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా మ‌ళ్లీ స‌మ‌యం కేటాయించుకోలేన‌ని చెప్పిన బాబు... ఏర్పాట్ల‌ను ఘ‌నంగా ఉండేలా చూడాల‌ని స్ప‌ష్టంగా ఆదేశించారు.