Begin typing your search above and press return to search.

మోడీ దత్తపుత్రుడు... జనంలోకి వెళ్తే ఇంతేనా...?

By:  Tupaki Desk   |   21 Sep 2022 2:30 AM GMT
మోడీ దత్తపుత్రుడు... జనంలోకి వెళ్తే ఇంతేనా...?
X
బాబుకు దత్తపుత్రుడు ఈ పదంతో పవన్ ని ట్యాగ్ చేస్తూ ఏపీలో పొలిటికల్ ర్యాగింగ్ కి వైసీపీ ఏనాడో శ్రీకారం చుట్టింది. అయితే అన్న మాటలు మనకే తగులుతాయి అంటారు. ఇపుడు మరొకరు వచ్చి దత్తపుత్రుడు ట్యాగ్ ని నేరుగా జగన్ కి తగిలిస్తున్నారు. అలా అన్న వారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. నరేంద్ర మోడీ ముద్దు బిడ్డ దత్తపుత్రుడు వేరెవరో కాదు అచ్చంగా జగనే అని ఆయన తేల్చేశారు.

జగన్ కి మోడీకి మధ్య అలాంటి చక్కని అనుబంధం ఉందని ఆయన చెప్పేశారు. మోడీ ఏమి చెబితే ఏపీలో జగన్ అదే చేస్తారు. ఆంధ్రాని ఆదానీ ఆంధ్రాగా జగన్ మార్చడం వెనక మోడీ ఉన్నారని దుయ్యబెట్టారు. ఏపీని అన్ని విధాలుగా జగన్ సర్వనాశనం చేస్తున్నారు, ఆయన వెనక మోడీ ఉన్నారని చింత మోహన్ ఫైర్ అయ్యారు. మోడీ అండతో ఏపీలో జగన్ వినాశకరమైన పాలన సాగిస్తున్నారు అని ఆయన ఘాటు కామెంట్స్ చేశారు.

ఏపీలో ఈ రోజుకి కోటి మంది దాకా తినడానికి తిండి లేని కడు నిరుపేదలు ఉన్నారు, వైసీపీ ఏలుబడిలో ఆర్ధిక అసమానతలు పెరిగిపోయాయి. అభివృద్ధి అన్నది ఎటు చూసినా ఏ కోశానా లేదు, ఏ వైపు చూసినా దోపిడే కనిపిస్తోంది అని కేంద్ర మాజీ మంత్రి మండిపడ్డారు. అమరావతి రాజధానికి మొండిగోడలుగా మార్చేసిన పుణ్యం జగన్ దే అని విరుచుకుపడ్డారు. ఏపీలో విద్యా వైద్య రంగాలు దారుణంగా దిగజారాయని, ఆ రంగాలలో ఉన్న వారు మనసు చంపుకుని పనిచేస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు.

ఉపాధ్యాయులను బంట్రోత్తులుగా మార్చారని, అలాగే అన్ని రంగాలలో కూడా ఏ మాత్రం ప్రగతి లేకపోగా అవినీతి ఉందని, మంత్రులు ఎమ్మెల్యేలకు డబ్బే పరమావధి అయిపోయిందని చింతా మోహన్ వైసీపీ సర్కారు ఏలుబడి అసలు గుట్టుని బయటపెట్టారు. ఒక్క చాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ని ఎంత తొందరగా సాగనంపాలా అని జనాలు ఎదురుచూస్తున్నారని ఆయన అంటున్నారు.

తండ్రి వైఎస్సార్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్ ఆయన ఆశయాలను నిండా ముంచేసి తూట్లు పొడిచారని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధే తప్ప కొత్తగా ఏమీ చేయడంలేదని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీ ఘోరంగా ఓడుతుందని, వంద కంటే తక్కువ సీట్లు వస్తాయని, ఇక రాహుల్ గాంధీ నాయకత్వాన కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు జనాల నుంచి మంచి స్పందన లభితోందని చెప్పుకొచ్చారు.

ఇవన్నీ సరే కానీ అసలే ఏపీలో బీజేపీ అంటే జనాలకు తెగ మంటగా ఉంది. అలాంటి టైం లో మోడీ ఏపీకి ఏమీ చేయడంలేదని అంతా గుర్రు మీద ఉన్నారు. ఇపుడు అదే మోడీకి దత్తపుత్రుడు అని జగన్ని ట్యాగ్ చేసి వదిలితే అది జనంలో కనుక పెద్ద ఎత్తున చర్చకు వస్తే కచ్చితంగా వైసీపీకి వచ్చే ఎన్నికల్లో అతి పెద్ద దెబ్బ పడిపోవడం ఖాయమనే అంటున్నారు. మరి కాంగ్రెస్ మోడీ దత్తపుత్రుడు అంటోంది అదే మాట టీడీపీ అనగలిగితే సీన్ టోటల్ గా మారుతుంది. మరి టీడీపీ మోడీ నీడ నుంచి బయటపడితేనే ఈ మాట అనగలదు, జనాలు కూడా వినగలరు, మరి ఆ విధంగా టీడీపీ తన స్ట్రాటజీ మార్చుకుంటుందా. చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.