Begin typing your search above and press return to search.

బ్రాహ్మణులపై వ్యాఖ్యలు.. సీఎం తండ్రిని కూడా వదల్లేదు

By:  Tupaki Desk   |   6 Sep 2021 5:30 AM GMT
బ్రాహ్మణులపై వ్యాఖ్యలు.. సీఎం తండ్రిని కూడా వదల్లేదు
X
ఒక రాష్ట్రానికి సీఎం అంటే ఆ దర్పం, అధికారం ఎంతుటుంది? అసలు వారి ఫ్యామిలీకి రెడ్ కార్పొట్ మర్యాదలు, బయట పరపతి ఉంటుంది. టచ్ చేయడానికి కూడా భయపడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలాంటివేమీ లేవు. సీఎం తండ్రి అయినా కేసు నమోదు చేశారు. స్వయంగా సీఎంనే తండ్రి చేసింది తప్పు లోపలేయండని అనడం సంచలనమైంది.

చత్తీస్ గఢ్ రాష్ట్రంలో సంచలనం నమోదైంది. ఏకంగా సీఎం భూపేష్ బాఘేల్ తండ్రి నందకుమార్ బాఘేల్ పై కేసు నమోదైంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డీడీ నగర్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

చత్తీస్ గఢ్ సీఎం తండ్రి నందకుమార్ ఇటీవల బ్రాహ్మణులను బహిష్కరించాలంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వబ్రాహ్మణ సమాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సెక్షన్ 153ఏ, 505(1)(బి) కింద కేసు నమోదు చేశారు.

ఈ వ్యవహారంపై సీఎం భూపేష్ బాఘేల్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. ‘చట్టానికి ఎవరూ అతీతులు కారు. 8 ఏళ్ల మానాన్న కూడా అందుకు మినహాయింపు కాదు. చత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రతి ఒక్క మతాన్ని వర్గాన్ని సామాజికవర్గం అభిప్రాయాలను , మనోభావాలను గౌరవిస్తుంది. అన్ని వర్గాలను , అన్ని సమాజాలను గౌరవిస్తుంది. ప్రతి ఒక్కరి మనోభావాలకు విలువనిస్తుంది.. ఓ సామాజికవర్గాన్ని ఉద్దేశించి మా నాన్న చేసిన వ్యాఖ్యలు మత సామరస్యానికి భంగం కలిగించాయని భావిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై నేను కూడా బాధపడుతున్నా.. రాజ్యాంగ హక్కులను రక్షించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని సీఎం సంచలన ప్రకటన చేశారు.

నందకుమార్ ఇటీవల బ్రాహ్మణులపై నోరుపారేసుకున్నారు. ‘బ్రాహ్మణులను మీ గ్రామాల్లోకి రానివ్వద్దని నేను భారత దేశంలోని గ్రామస్థులందరినీ కోరుతున్నాను. వారిని బహిష్కరించడానికి ఇతర సామాజికవర్గాల్లో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతాను. వారిని వోల్గా నది ఒడ్డుకు తిరిగి పంపాలి’ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై యూపీ సహా పలు ప్రాంతాల్లో బ్రాహ్మణ సామాజికవర్గం విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ దుమ్మెత్తి పోస్తున్నారు.