Begin typing your search above and press return to search.

రాహుల్.. ప్రియాంకలను వారు కొడుతుంటే ఏడుపొస్తుందన్న కాంగ్రెస్ నేత

By:  Tupaki Desk   |   14 Aug 2022 5:38 AM GMT
రాహుల్.. ప్రియాంకలను వారు కొడుతుంటే ఏడుపొస్తుందన్న కాంగ్రెస్ నేత
X
పవర్ లో ఉన్నప్పుడు ఎవరైనా మహరాజులా వెలిగిపోతుంటారు. కానీ.. పవర్ చేజారిన తర్వాత అలాంటి వారిని సైతం పెద్దగా పట్టించుకోని వైనం నేటి రాజకీయాల్లోమామూలు అంశంగా మారింది. గతంలోని రాజకీయాలకు వర్తమాన రాజకీయాలకు ఏ మాత్రం పోలిక లేని విషయం తెలిసిందే. గతంలో నేత స్థాయిని అనుసరించి.. వారికి పవర్ ఉన్నా లేకున్నా.. కాస్తంత తేడాతో గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవారు. కానీ.. ఈ మధ్యన వచ్చి పడిన దూకుడు రాజకీయాలతో పరిస్థితులు మొత్తం మారిపోయిన పరిస్థితి.

ఎవరన్నా లెక్క లేకపోవటం.. ఎంత పెద్ద నేత అయినప్పటికీ వారిని పూచిక పుల్ల మాదిరి తీసేయటం.. మరీ ముఖ్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మొదట్నించి అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరించే పోలీసులు.. కొన్ని కీలక అంశాల్లో మాత్రం తమకున్న విచక్షణతో వ్యవహరించేవారు.

ఈ మధ్య కాలంలో అలాంటి పరిస్థితుల్లో మార్పులుచోటు చేసుకుంటున్నాయి. కీలక స్థానాల్లో ఉండే పోలీసు అధికారులు ఏ మాత్రం తమ మాట వినకున్నా.. తమ మనసుకు నచ్చనట్లుగా వ్యవహరించినా.. వారిని శంకరగిరి మాన్యాలకు పట్టించటం.. తమకు అనుకూలంగా ఉన్న వారిని తీసుకొచ్చి పెద్దపీట వేయటం లాంటివి కామన్ గా మారిపోయిన పరిస్థితి.

దీంతో.. అధికారంలో ఉన్న వారికి ఎవరైతే రాజకీయ ప్రత్యర్థులు అవుతారో.. వారే పోలీసులకు.. కొన్ని విభాగాల అధికారులకు ప్రత్యర్థులుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అయిన రాహుల్.. ప్రియాంకలు సైతం గల్లీ నాయకులుగా కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఈ మధ్యన ఎక్కువైందని చెబుతున్నారు.

మోడీ సర్కారు అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఈ మధ్యన దూకుడు పెంచిన ప్రియాంక.. తాను చేసే నిరసనల్లో భాగంగా బ్యారికేడ్ దూకిన వైనం.. ఆమెపై పోలీసులు లాఠీలు ఝుళిపించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత.. ఏపీలో కాంగ్రెస్ ఒక వెలుగు వెలిగినప్పుడు తిరుగులేని నేతగా వ్యవహరించిన చింతా మోహన్ తాజాగా మాట్లాడుతూ.. తన ఆవేదనను వ్యక్తం చేశారు.

తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఎస్సీలు.. ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని.. ఇవాల్టి రోజున దళితులు దేవాలయాలకు.. స్కూళ్లు.. కాలేజీలకు వెళుతున్నారంటే అదంతా కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనగా అభవర్ణించారు. ఇందిరాగాంధీకి వారసులైన రాహుల్.. ప్రియాంక గాంధీలను పోలీసులు కొడుతుంటే ఏడుపు వస్తోందన్న ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ తన సత్తా చాటుతుందన్న మాట మాత్రం బడాయి మాటగా.. వాస్తవానికి దూరంగా నిలిచే మాటలా మారిందని చెప్పక తప్పదు.