Begin typing your search above and press return to search.

కేసీఆర్ పోరాటానికి కాంగ్రెస్ మ‌ద్ద‌తు!

By:  Tupaki Desk   |   30 Jun 2017 5:22 PM GMT
కేసీఆర్ పోరాటానికి కాంగ్రెస్ మ‌ద్ద‌తు!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటే ఇంతెత్తున ఎగిరిప‌డే కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆయ‌న‌కే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌ర‌మే కాదు వింత కూడా క‌దా! రాజ‌కీయాల్లో ఎప్పుడేం జ‌రుగుతుందో చెప్ప‌లేం అనేదానికి ఎన్నో సంద‌ర్భాలు ఉంటాయి క‌దా. అందులో ఇది కూడా ఒక‌టి. ఇంత‌కీ విష‌యంలో ఏమంటే తాజాగా తెలంగాణ ప్ర‌ధాన‌ ప్రతిపక్ష నేత కే. జానారెడ్డి - మండ‌లి విప‌క్ష‌నేత ష‌బ్బీర్ అలీ - ఉపనేతలు జీవ‌న్ రెడ్డి - పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా జీఎస్టీపై విరుచుకుప‌డిన కాంగ్రెస్ నేత‌లు అవ‌స‌ర‌మైతే కేసీఆర్‌ కు మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారు.

సీఎల్పీ నేత‌ జానారెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ వ‌ల్ల రైతులకు భారం ప‌డుతుంద‌ని అన్నారు. ట్రాక్టర్ల మీద పన్ను వేయ‌డం, బ్యాంక్ లో సేవా పన్ను వసూలు చేయ‌డం వంటివి వ్యవసాయం అంటే ఆసక్తి తగ్గే పరిస్థితిని సృష్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ హామీల‌కే పరిమితమ‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం బ్యాంక‌ర్ల స‌మావేశం నిర్వహించి అప్పుల మీద స్పష్టత ఇవ్వలేదని జానారెడ్డి తెలిపారు. పెట్టుబడులకు కనీసం 25 శాతం ఇవ్వలేదని తెలిపారు. 15 రోజుల్లో పంట రుణాలు ఇచ్చే విదంగా చూడాలని జానారెడ్డి కోరారు. ప్రజలను మోసం చేసే ప్రకటనలతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని ఈ సంద‌ర్భంగా మండిప‌డ్డారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేసీఆర్ నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చార‌ని, ఆ నిర్ణ‌యం వ‌ల్ల రైతులకు ఇప్పుడు బ్యాంక్ లు డబ్బులు ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు. కేంద్రంతో మాట్లాడి అదనంగా 5 వేల కోట్లు డబ్బులు బ్యాంక్ లకు తెప్పించాల‌ని ష‌బ్బీర్ అలీ డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు జీఎస్టీలో 28 శాతం టాక్స్ వల్ల 10 లక్షల కుటుంబాలు రోడ్ మీదకు వచ్చే అవకాశం ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉపాధి హామీ కూలీలకు కూడా నగదు డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టెక్స్‌టైల్‌, గ్రానైట్ పరిశ్రమ మూత పడే ప్రమాదం ఉందని తెలిపారు. సీఎం హైద్రాబాద్‌కు తిరిగి రావడంలో ఉన్న మతలబు ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. జీఎస్టీని బ‌హిరంగంగా వ్యతిరేకించే దమ్ము లేక‌నే ఇలా చేశార‌ని ష‌బ్బీర్ అలీ ఆరోపించారు.

సీఎల్పీ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నాయకత్వంలో, నోట్ల రద్దు రోజులు, ఇప్పుడు జీఎస్టీ రోజులు వ‌చ్చాయ‌ని తెలిపారు. అయితే ఇవ‌న్నీ చెవులో పువ్వులు పెట్టే విధానమ‌ని మండిప‌డ్డారు. రాష్ట్రాలు కేంద్రాన్ని అడుక్కునే పరిస్థితి ఏంటని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్రం ఎందుకు అడుక్కునే స్థితికి వ‌చ్చిన నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అఖిల పక్షాన్ని పిలవాల‌ని కోరారు. అన్ని రకాల వారు ఇబ్బంది పడుతుండ‌టం చూస్తుంటే ఇది గ్యాంబ్లింగ్ టాక్స్ విధానం అని అనొచ్చని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి, కేంద్రానికి ఏమైనా చీకటి ఒప్పందాలు ఉన్నాయా అని సందేహం వ్య‌క్తం చేశారు. అలా ఏమీ లేక‌పోతే జీఎస్టీకి వ్య‌తిరేకంగా సీఎం కేసీఆర్‌ పోరాటం చేస్తే తాము మద్దతు ఇస్తామని పొంగులేటి తెలిపారు.

సీనియ‌ర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ బ్యాంక్‌లు మానవీయ కోణంలో ఉండాలని ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్ అంటున్నారని అయితే అసలు సీఎం కేసీఆర్‌కు మానవీయ కోణం ఉందా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రస్థాయి బ్యాంక‌ర్ల స‌మావేశానికి సీఎం రావాలి కానీ ఎందుకు రాలేదని ప్ర‌శ్నించారు. ఆ సమయం లేకపోవడం దురదృష్టకరమ‌ని,రైతులకు వారి డబ్బు వారికే ఇవ్వడానికి బాంక్ లు ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించ‌డం లేద‌ని మండిప‌డ్డారు. బీడీ పరిశ్రమ జీఎస్టీ ప‌రిధిలో ఉంటుంది కానీ పెట్రోల్, మద్యం ఎందుకు ఉండదని ప్ర‌శ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని ఆయ‌న‌ కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/