Begin typing your search above and press return to search.

జీఎస్టీలోకి పెట్రోల్‌...ఓ ప‌గ‌టిక‌ల‌

By:  Tupaki Desk   |   23 Dec 2017 6:02 AM GMT
జీఎస్టీలోకి పెట్రోల్‌...ఓ ప‌గ‌టిక‌ల‌
X
జీఎస్టీ ప‌రిధిలోకి పెట్రోల్ వ‌చ్చేస్తుంది...త‌ద్వారా మ‌న‌పై ప‌డుతున్న విప‌రీత భారం త‌గ్గిపోతుంద‌ని భావిస్తున్న వారికి ఓ బ్యాడ్ న్యూస్‌. ఇది అయ్యే ప‌ని కాద‌ని తేలింది. అందులోనూ ఇదేదో పిచ్చాపాటి జోస్యం అనుకోకండి. ప‌క్కాగా ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ల‌తో కూడిన బృందం చెప్పిన మాట‌! పెట్రోలియం ఉత్పత్తులను పాలకులు వస్తు - సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస్తారని భావించడం పగటికలే అవుతుందని అసోచామ్ స్పష్టం చేసింది!! దీనిపై కేంద్ర - రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం ఎన్నటికీ కుదరదని, అటు రాష్ర్టాలతో పాటు ఇటు కేంద్రం తమ ఆదాయ వసూళ్ల కోసం పెట్రోలియం ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని అసోచామ్ అభిప్రాయపడింది.!!!

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలో చేర్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సుముఖంగా ఉందని, అయితే దీనిపై నిర్ణయం తీసుకునే ముందు రాష్ర్టాలతో ఏకాభిప్రాయాన్ని కుదుర్చుకోవాలని భావిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ నెల 19వ తేదీన రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీని వలన వినియోగదారులపై పన్నుల భారం తగ్గుతుందని, కనుక పెట్రోలియం ఉత్పత్తుల ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వాంఛనీయమేనని అసోచామ్ పేర్కొంది. అయితే కేంద్రంతో పాటు రాష్ర్టాలు తమ ఆదాయ వసూళ్ల కోసం పెట్రోలియం ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయన్నది వాస్తవమని అసోచామ్ స్ప‌ష్టం చేసింది. కేంద్ర, రాష్ర్టాలు కలసి పెట్రోల్, డీజిల్‌పై 100 నుంచి 130 శాతానికి పైగా పన్నులు విధిస్తున్నాయని, కనుక పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వాంఛనీయమే అయినప్పటికీ దీనిపై కేంద్రంతో పాటు రాష్ర్టాల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అసోచామ్ అభిప్రాయపడింది.

పెట్రోలియం ఉత్పత్తులపై విధించిన పన్నుల ద్వారా భారీ మొత్తంలో వస్తున్న ఆదాయాన్ని వదులుకునేందుకు కేంద్ర, రాష్ర్టాలు సిద్ధపడతాయా? అని అసోచామ్ సందేహాన్ని వ్యక్తం చేసింది. ఒకవేళ కేంద్ర, రాష్ర్టాలు ఇందుకు సుముఖంగా ఉన్నట్లయితే ఆదాయం కోసం వాటికి ఉన్న ఇతర ప్రత్యామ్నాయ వనరులు ఏమిటని అసోచామ్ ప్రశ్నించింది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలో 28 శాతంగా ఉన్న గరిష్ట పన్ను శ్లాబు రేటులో చేర్చడంతో పాటు అంతకుమించి మరికొంత పన్ను విధించేందుకు అనుమతించినప్పటికీ మొత్తం పన్ను కలసి 50 శాతం మించదని, ఈ విధంగా చేసినప్పటికీ వినియోగదారులకే లబ్ధి చేకూరుతుందని, ఇందుకు ప్రభుత్వం అంత సులభంగా అంగీకరించకపోవచ్చని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డీఎస్ రావత్ అన్నారు.