Begin typing your search above and press return to search.

కిందివాటిలో ఏది త‌క్కువ కులం?.. ఎంఏ పరీక్ష‌ల్లో వివాదాస్ప‌ద‌మైన ప్ర‌శ్న‌!

By:  Tupaki Desk   |   17 July 2022 5:00 PM IST
కిందివాటిలో ఏది త‌క్కువ కులం?.. ఎంఏ పరీక్ష‌ల్లో వివాదాస్ప‌ద‌మైన ప్ర‌శ్న‌!
X
ఎంఏ ప‌రీక్ష‌ల్లో భాగంగా త‌మిళనాడులోని పెరియార్ యూనివ‌ర్సిటీ అడిగిన ప్ర‌శ్న ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ప్ర‌స్తుతం అక్క‌డ ఎంఏ ఫ‌స్టియ‌ర్ రెండో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌శ్న‌ప‌త్రంలో 'కింది వాటిలో తమిళనాడుకు చెందిన తక్కువ కులం ఏది?' అనే ప్రశ్న అడిగారు. జవాబు ఎంచుకునేందుకు నాలుగు కులాల పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. ఎ ఆప్ష‌న్ కింద మ‌హ‌ర్లు, బి ఆప్ష‌న్ కింద నాడార్లు, సి ఆప్ష‌న్ కింద య‌జ‌వాస్, డి ఆప్ష‌న్ కింద హ‌రిజ‌న్స్ అని ఇచ్చారు.

ఫ్రీడం మూవ్‌మెంట్‌ ఆఫ్ తమిళనాడు ఫ్రం 1800-1947 అనే సబ్జెక్టు పరీక్ష రాసిన విద్యార్థులకు ఇచ్చిన ఈ ప్ర‌శ్న ఆ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు, విద్యావేత్త‌లు, ఆయా కుల సంఘాల విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది.

సోష‌ల్ మీడియాలోనూ ఈ ప్ర‌శ్న వైర‌ల్ గా మారింది. ఆ ప్ర‌శ్న‌ప‌త్రాన్ని పోస్టు చేసిన నెటిజ‌న్లు పెరియార్ యూనివ‌ర్సిటీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసమానతలు రూపుమాపే దిశగా విద్యను అందించాల్సిన ప్రొఫెసర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

దీనిపై స్పందించిన పెరియార్ యూనివర్సిటీ ఉప కులపతి జగన్నాథన్ ప్రశ్నాపత్రం తాము తయారు చేయలేదని, వేరే యూనివర్సిటీ సిబ్బంది రూపొందించారని తెలిపారు. క్వశ్చన్‌ పేపర్‌ లీక్ కాకూడదనే తాము వేరే విద్యా సంస్థ‌ల‌కు, యూనివ‌ర్సిటీల‌కు ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను త‌యారు చేసే బాధ్య‌త‌ను ఇస్తున్నామ‌ని చెప్పారు. పరీక్ష జరిగే వరకు ప్రశ్నపత్రాన్ని తామెవరూ చూడలేదన్నారు. అందులోని వివాదాస్పద ప్రశ్న గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరిపి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రశ్నపత్రాన్ని సెట్ చేసిన సంబంధిత అధికారి నుంచి నివేదిక కోరామని తెలిపారు. తిరిగి పరీక్ష నిర్వహించే ఆలోచన లేదని వెల్లడించారు.

మ‌రోవైపు దీనిపై త‌మిళ‌నాడు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విచారణకు ఆదేశించారు. సేలంలోని పెరియార్ యూనివ‌ర్సిటీ పీజీ చరిత్ర పరీక్షలో అడిగే కులతత్వ ప్రశ్నల వెనుక ఉన్న వ్యక్తులపై విచారణ జరిపేందుకు ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నామని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా కుల‌త‌త్వ ప్ర‌శ్న అడ‌గ‌డాన్ని ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే, కమల్ హాసన్ ఎంఎన్‌ఎం, డీఎంకే, సీపీఎం వంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. ఒక సంఘ సంస్కర్త పేరుతో ఉన్న యూనివ‌ర్సిటీలో కులతత్వానికి సంబంధించిన ప్రశ్న రావడం దురదృష్టకరం అంటూ ఖండించాయి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి.