Begin typing your search above and press return to search.

కరోనా డేంజర్: దేశంలో మళ్లీ తిరగబడుతున్న వ్యాధి

By:  Tupaki Desk   |   13 April 2020 6:30 PM IST
కరోనా డేంజర్: దేశంలో మళ్లీ తిరగబడుతున్న వ్యాధి
X
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అప్పుడిప్పుడే వదిలేలా కనిపించడం లేదు. అంత తేలికగా మనిషిని వదలిపెట్టేలా లేదు. కరోనా వ్యాధిని జయించి కోలుకున్న వారికి మళ్లీ తిరగబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.

కొద్దిరోజుల క్రితం దక్షిణ కొరియాలో కరోనా వైరస్ తో పోరాడి కోలుకున్న వారిలో మళ్లీ ఆ వైరస్ తిరగబడడం సంచలనంగా మారింది. దక్షిణకోరియాలో కరోనాను జయించిన 91 మందికి మళ్లీ కరోనా తిరగబడింది. ఈ కేసులు తాజాగా నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ 91మందిలో ఎవరికి కరోనా వైరస్ రెండోసారి సోకి ఉండకపోవచ్చని.. అంతర్గతంగా ఉన్న వైరసే మళ్లీ విజృంభించినట్టు వైద్యులు పరీక్షల్లో తేల్చారు.

ఇక భారత్ లోనూ తాజాగా కరోనా రిపీట్ అవ్వడం కలకలం రేపుతోంది. కరోనా సోకి చికిత్స పొంది నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ అయిన ఇద్దరికీ మళ్లీ కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.

ఢిల్లీకి దగ్గర్లోని నోయిడాలో జిమ్స్ మెడికల్ కాలేజీలో ఇద్దరు పేషంట్లకు కరోనా చికిత్స చేయడంతో కోలుకున్నారు. పరీక్షల్లో కరోనా నెగెటివ్ రావడంతో వారు ఇద్దరినీ ఏప్రిల్ 10న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.

అయితే తాజాగా మళ్లీ వారిలో లక్షణాలు బయటపడ్డాయి. పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో డిశ్చార్జ్ అయిన వాళ్లు తిరిగి హాస్పిటల్ లో చేరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పంపిస్తామని.. ఇలా కరోనా తిరగబడడం ఆందోళనకరమని స్థానిక వైద్యులు తెలిపారు.

ఇలా మళ్లీ తిరగబడుతుండడంతో వ్యాధి మరింత మందికి సోకుతుందని.. దీనికి అంతం లేదా అన్న భయం వైద్య వర్గాల్లో నెలకొంది.ఇలానే కొనసాగితే కరోనాను అదుపు చేయడం కష్టమని భావిస్తున్నారు. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా, దేశంలో కరోనా రోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది.