Begin typing your search above and press return to search.

చెత్త వాహనంలో కరోనా డెడ్​బాడీ.. చచ్చిపోయిన మానవత్వం..!

By:  Tupaki Desk   |   11 April 2021 9:35 AM GMT
చెత్త వాహనంలో కరోనా డెడ్​బాడీ.. చచ్చిపోయిన మానవత్వం..!
X
కరోనా తీసుకొచ్చిన విపత్తులో మానవత్వం మరుగున పడిపోతున్నది. ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిస్తే.. కనీసం ఈ వీధివైపు కూడా కన్నెత్తి చూడటం లేదు. గతంలో కరోనా మృతదేహాలను.. ట్రాక్టర్లలో తరలించి.. జేసీబీ సాయంతో పూడ్చిపెట్టిన ఘటనలు ఎన్నో చూశాం. ఇక కరోనా రోగులను ఎంత దారుణంగా ట్రీట్​​ చేశారో ఎన్నో ఘటనలు చూశాం. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ నడుస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇదిలా ఉంటే తాజాగా అదే రాష్ట్రంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకున్నది.

కరోనాతో చనిపోయాడన్న కారణంతో ఓ మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఓ చెత్త వాహనంలో మృతదేహాన్ని తీసుకెళ్లారు.

మహారాష్ట్రలోని షక్రి తాలూకాలోని సమోద్ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. కానీ, ఎంతసేపటికి అంబులెన్స్ రాలేదు. గ్రామ సర్పంచ్ ను వేడుకున్నా ఏమీ చేయలేకపోయాడు. దీంతో గ్రామపంచాయతీ వాళ్లు చెత్తను తీసుకెళ్లే వాహనంలో ఈ మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో వైరల్​ గా మారాయి.

కరోనా వేళ మనుషులు ఎలా తయారయ్యారో అని చెప్పేందుకు ఈ ఘటన అద్దం పడుతున్నది. గతంలోనూ ఇటువంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి.మరోవైపు దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. సెకండ్​వేవ్​ విరుచుకుపడుతున్నది. రోజులకు లక్షా యాబైవేల పై చిలుకు కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నా.. మరోవైపు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.