Begin typing your search above and press return to search.

ప్రపంచంలో చోటు చేసుకునే మహమ్మారి చావుల్లో మనోళ్లు ఎందరంటే?

By:  Tupaki Desk   |   4 Oct 2020 8:00 AM IST
ప్రపంచంలో చోటు చేసుకునే మహమ్మారి చావుల్లో మనోళ్లు ఎందరంటే?
X
షాకింగ్ నిజం ఇది. పాలకుల కమిట్ మెంట్ కానీ.. మరేమైనా కానీ ప్రపంచాన్ని వణికించే మహమ్మారి మన దేశంపై దారుణ ప్రభావాన్ని చూపింది. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే.. మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష మంది మరణించినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విషాదకరమైన అంశం ఏమంటే.. కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే ప్రతి పది మరణాల్లో.. ఒకరు మనోళ్లు ఉండటం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా ప్రతి రోజు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు మరణిస్తున్నారు. వీరిలో భారత్ వాటా అంతకంతకూ పెరుగుతోంది. మొదట్లో కరోనా మరణాలు మన దేశంలో తక్కువగా ఉన్నప్పటికీ.. పెరుగుతున్న కేసులకు తగ్గట్లే మరణాలు పెరుగుతున్నాయి. గడిచిన నెల రోజులుగా రోజుకు వెయ్యికి పైగా మరణాలు దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. అధికారికంగా కరోనా మరణాలు ఇంత భారీగా ఉంటే.. అనధికారికంగా మరింత ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

కరోనాను గుర్తించకపోవటం.. కరోనా సోకినా దాని గురించి బయటకు వెల్లడి కాకపోవటం లాంటి ఉదంతాల్లోనూ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అవేమీ రికార్డుల్లో నమోదు కావటం లేదు. దేశ జనాభాతో కోవిడ్ మరణాల్ని చూసినప్పుడు తక్కువ శాతం మరణాలు చోటు చేసుకుంటున్నట్లుగా కనిపించక మానదు. కానీ.. సంఖ్య పరంగా చూస్తే మాత్రం కోవిడ్ మరణలు కొట్టిపారేసంత తక్కువగా ఏమీ లేవన్న భావన కలుగక మానదు. ఇదిలా ఉంటే.. అధికారికంగా వెల్లడిస్తున్న మరణాల కంటే వాస్తవం మరికొంత ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అధికారిక లెక్కలతో పోలిస్తే.. కోవిడ్ మరణాలు ఎక్కువన్న విశ్లేషణ ఆరోగ్య నిపుణులు.. శాస్త్రవేత్తలు నోట వినిపిస్తోంది. ఇదే అంశాన్ని తన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖాముఖిలోనూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనటం గమనార్హం. కోవిడ్ మరణాల్ని భారత్ దాచి పెడుతుందని ట్రంప్ విమర్శించటం తెలిసిందే.