Begin typing your search above and press return to search.

రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్లకు 'కరోనా' ఎఫెక్ట్..

By:  Tupaki Desk   |   18 March 2020 2:30 AM GMT
రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్లకు కరోనా ఎఫెక్ట్..
X
కరోనా...ఈ మహమ్మారి వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రపంచ దేశాలన్నీ కట్టుదిట్టమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. జనం సామూహికంగా ఒక చోట చేరే కార్యక్రమాలన్నింటినీ రద్దు చేస్తున్నాయి. ఆఖరికి కోర్టులు కూడా అత్యవసర కేసులను మాత్రమే విచారణ చేపడుతూ...పరిమిత సంఖ్యలో మాత్రమే కోర్టులోకి ప్రజలను అనుమతిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో నిత్యం జనంతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ లలో రద్దీని నివారించేందుకు భారత రైల్వే శాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50కి పెంచుతూ రైల్వేశాఖ ఓ ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో రైల్వే ప్లాట్ ఫాంలపై రద్దీని నివారించేందుకు ఈ చర్యలు తీసుకుంది.

‘కరోనా’ ప్రభావం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ముందస్తు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. సాధారణంగా రైల్వే స్టేషన్లు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ఇటువంటి ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. దేశంలోని 250 రైల్వేస్టేషన్ లలో ప్లాట్ ఫామ్ టికెట్ల ధరను పెంచింది. గతంలో రూ.10 ఉన్న ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.50 కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ టికెట్ ధరలే అమలులో ఉంటాయని తెలిపింది. ‘కరోనా’ ప్రభావం తగ్గిన తర్వాత టికెట్ల ధర తగ్గిస్తామని తెలిపింది.