Begin typing your search above and press return to search.

తెలంగాణలో పెరగని కరోనా కేసులు.. రహస్యం ఇదేనా?

By:  Tupaki Desk   |   9 May 2020 2:00 PM GMT
తెలంగాణలో పెరగని కరోనా కేసులు.. రహస్యం ఇదేనా?
X
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉనికే లేనప్పుడు తెలంగాణలో కరోనా కేసులు మొదలయ్యాయి. బాగా పెరిగాయి కూడా. కరోనా కేసుల్లో మొదట తెలంగాణ దూసుకుపోయింది. ఏపీలో తబ్లిగి ఘటనతో కేసులు మొదయ్యాలయి. ఇప్పుడు 2 వేలకు చేరువయ్యాయి. అయినా తెలంగాణలో 1000 దగ్గరే కేసులు ఆగిపోయాయి. తబ్లిగి ఘటనలు వెలుగుచూసినా.. ఏపీకంటే ఒక వర్గం జనాభా బాగా ఎక్కువగా ఉన్నా తెలంగాణలో కేసులు పెరగాలి. కానీ అలా పెరగలేదు. దీనికి కారణమేంటై ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలుస్తోంది. దీనంతటికీ.. తెలంగాణలో కరోనా పరీక్షలు చేయకపోవడమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అవును తెలంగాణలో కరోనా టెస్టులు నిలిచిపోయాయి. పెద్దగా జరగడం లేదు. అనుకున్న స్థాయిలోనూ చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.. కరోనాను కట్టడి చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో పరోక్షంగా వైరస్ వ్యాప్తికి కారణమవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఉదాసీనత ఇందుకు దోహదపడుతోందట..

తెలంగాణలో కరోనా సోకిన రోగి సెకండరీ కాంటాక్టుల టెస్టులు ఎప్పుడో బంద్ పెట్టారు. రోగ లక్షణాలు బయటపడితేనే టెస్టులు చేస్తున్నారు. తాజాగా కరోనా రోగి ప్రైమరీ కాంటాక్టులకు కూడా టెస్టులు నిలిపేశారని ప్రచారం సాగుతోంది. కరోనా పాజిటివ్ వ్యక్తులు ఎవరెవరిని కలిశారో ఖచ్చితమైన డేటాను తెలుసుకొని అలర్ట్ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో టెస్టులు పూర్తిగా ఆపేయడం కరోనా వ్యాప్తికి కారణమవుతోందన్న ఆందోళన తెలంగాణలో భయం గొలుపుతోంది.

తెలంగాణలో తాజాగా నమోదవుతున్నకేసులన్నీ హైదరాబాద్ పరిధిలోనివే. నిన్న 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆ కుటుంబాలను అధికారులు క్వారంటైన్ చేశారు. అయితే వారికి ఎవరికీ టెస్టులు చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. నాగోల్ లో ఒక వ్యక్తికి కరోనా రాగా.. ఆ కుటుంబంలోని ఆరుగురికి కూడా టెస్టులు చేయలేదు. ఇలా తెలంగాణలో ప్రైమరీ కాంటాక్టుల వారికీ కూడా కరోనా టెస్టులు చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు. వారి ద్వారా ఇంకా ఎంతమందికి సోకిందో కూడా తెలియదు. లక్షణాలు బయటపడ్డ వారికి మాత్రమే చేస్తామని అధికారులు చెబుతున్నారు. 20 రోజుల వరకు కరోనా లక్షణాలు బయటపడవు. లాక్ డౌన్ సడలింపులు నేపథ్యంలో ఈ 20 రోజుల్లో వీరు ఎంతమందికి వైరస్ అంటిస్తారో ఊహించుకుంటేనే భయంగా ఉంది. టెస్టులు చేయకపోవడం కారణంగానే తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గుతోంది. టెస్టులు చేస్తే రోజుకు ఎన్నో కేసులు బయటపడుతాయి. కానీ చేయకుండానే తగ్గిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.