Begin typing your search above and press return to search.

36 వేల మంది పోలీసులకు కరోనా.. టెన్షన్​లో కేంద్ర హోంశాఖ

By:  Tupaki Desk   |   28 Sept 2020 10:15 AM IST
36 వేల మంది పోలీసులకు కరోనా.. టెన్షన్​లో  కేంద్ర హోంశాఖ
X
కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోలీసులు ఎంతో సేవ చేస్తున్నారు. ప్రారంభ సమయంలో కరోనాకు భయపడి అందరూ ఇళ్లకే పరిమితం అయితే పోలీసులు మాత్రం రాత్రనక, పగలనక విధులు నిర్వహించారు. 8 నెలలుగా కనీసం వారు సెలవు కూడా తీసుకోలేని పరిస్థితి. దీంతో కరోనా మహమ్మారి పోలీసులను వదిలిపెట్టడం లేదు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కేంద్రహోంశాఖ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 36 వేలమందికి కరోనా సోకింది. 128 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్రహోంశాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎన్‌ఎస్‌జీతోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 30 వేలమంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 6 వేలమంది చికిత్సపొందుతున్నారు.

పాకిస్థాన్​, బంగ్లాదేశ్​ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న బీఎస్​ఎఫ్​ సిబ్బందిలో 10,636 మంది కరోనా బారిన పడ్డారు. సీఆర్‌పీఎఫ్‌లో కూడా 10,602మంది పోలీసులకు కరోనా సోకినట్టు కేంద్రహోంశాఖ నివేదిక వెల్లడిస్తున్నది. సీఐఎస్‌ఎఫ్‌లో 6466 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐటీబీపీలో 3845, ఎస్‌ఎస్‌బీలో 3684, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లో 514తోపాటు ఎన్‌ఎస్‌జీలో 250 మందికి వైరస్​ సోకింది. సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది 52మంది, బీఎస్‌ఎఫ్‌లో 29, సీఐఎస్‌ఎఫ్‌లో 28మంది చనిపోయారు ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలలో తొమ్మిది మంది చొప్పున కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. కరోనా సోకిన వారిని వెంటనే క్వారంటైన్​లో ఉంచుతున్నామని వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని హోంశాఖ తెలిపింది. ఇన్ని వేల మంది వైరస్ బారిన పడటంతో పోలీసులు, వివిధ భద్రతా పరమైన శాఖల ఉద్యోగుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.