Begin typing your search above and press return to search.

పవన్ తో కామ్రేడ్స్ భేటీ ముచ్చటేంది?

By:  Tupaki Desk   |   1 Dec 2016 4:00 PM GMT
పవన్ తో కామ్రేడ్స్ భేటీ ముచ్చటేంది?
X
తరచూ మీడియాలో దర్శనం ఇవ్వటమే కాదు.. తరచూ ఏదో ఒక కార్యక్రమంతో కనిపిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా కామ్రేడ్స్ తో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాల మీదా.. పెద్ద నోట్ల రద్దు అంశంతో సహా పలు అంశాలపై సీపీఐ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ తో కలిసిన పవన్ కల్యాణ్.. వివిధ అంశాలపై చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు.

భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. వామపక్ష నేతలతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి భేటీలు తరచూ కావటంతో పాటు.. వివిధ అంశాలపై కమ్యూనిస్టుల ఆలోచనలు.. అభిప్రాయాలు.. వారి ఫీడ్ బ్యాక్ ల కోసమే పవన్ తాజా భేటీ అన్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. కమ్యూనిస్టులతో భేటీ కావటం వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదని.. ఏపీలో వామపక్షాల బలం అంతకంతకూ తగ్గిపోతున్న వేళ.. అలాంటి వారితో కలిసి నడవాలనుకోవటం నష్టమే తప్పించి.. లాభం ఎంతమాత్రం కాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన సమావేశం మర్యాదపూర్వకంగా సాగిందే తప్పించి.. ఎలాంటి రాజకీయ ప్రత్యేకత లేదని స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులు.. రాజకీయాంశాలపై ఇరు నేతల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి భేటీ రానున్న రోజుల్లో మరిన్ని ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భావసారూపత్య కలిగిన అంశాల మీద వామపక్షాలతో కలిసి జనసేన పోరాడుతుందన్న నిర్ణయాన్ని ఇరువర్గాలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/