Begin typing your search above and press return to search.

ఇంతకీ డీఎస్ ఏ పార్టీనబ్బా.?

By:  Tupaki Desk   |   16 July 2021 6:18 PM GMT
ఇంతకీ డీఎస్ ఏ పార్టీనబ్బా.?
X
రాజకీయాలు కప్పల తక్కెడగా మారిపోయాయి. బలం ఉన్న చోటుకు కప్పలు వలసపోయినట్టు నేతలు కూడా అధికారం ఉంటే జంప్ అవుతున్నారు. అలా జంప్ అయిన సీనియర్ నేతల్లో ధర్మపురి శ్రీనివాస్ ఒకరు. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నేత, ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ గా చేసిన డీఎస్ అంటే తెలియని వారుండరు. వైఎస్ఆర్ తో కలిసి రెండు సార్లు కాంగ్రెస్ ను ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చారు.

డీ. శ్రీనివాస్ (డీఎస్).. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో పీసీసీ చీఫ్ గా అన్నీ తానై వ్యవహరించిన నేత. బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన ఈయన అప్పట్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుకు తోడ్పడ్డారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయగల సామర్థ్యం ఈయన సొంతం. అయితే తదనంతర కాలంలో టీఆర్ఎస్ లో చేరారు. సీనియర్ కావడంతో కేసీఆర్ రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు.

కానీ మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ తో డీఎస్ దోస్తీ చెడింది. నిజామాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేసీఆర్ కూతురు కవితకు వ్యతిరేకంగా తన అనుచరులు, నాయకులను ఆయన ఉసిగొల్పుతున్నారని గులాబీ ఎమ్మెల్యేలంతా కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని కోరారు. అయితే కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం వహించి ఆయనను పార్టీకి దూరం గా పెట్టారు. సస్సెండ్ చేస్తే ఆయన రాజ్యసభ సీటులోనే కొనసాగుతారు. ఆయన వేరే పార్టీలో చేరితే అనర్హత వేటు వేద్దామని వేచిచూశారు. తద్వారా రాజ్యసభ సీటును దక్కించుకోవాలని యోచించారు.

అయితే ఇక్కడే తలపండిన డీఎస్ రాజకీయం చేశారు. వేరే పార్టీలో అధికారికంగా చేరకుండా.. వారి కండువా కప్పుకోకుండా టీఆర్ఎస్ ఎంపీగానే ఉంటూ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అధికారికంగా టీఆర్ఎస్ ఎంపీ అయినా బీజేపీకి సాన్నిహిత్యంగా మెలుగుతున్నారు. డీఎస్ వేరే పార్టీ కండువా వేసుకొని కనిపిస్తే అప్పుడు అనర్హత వేటు వేద్దామని కేసీఆర్ చూస్తున్నా డీఎస్ మాత్రం ఎక్కడా దొరకడం లేదు. అలా ఎంపీ సీటును కాపాడుకునేందుకు డీఎస్ వేస్తున్న ఎత్తులు కేసీఆర్ చుక్కలు చూపిస్తున్నాయి.

డీఎస్ తన కొడుకు, నిజామాబాద్ ఎంపీ అరవింత్ సాయంతో బీజేపీతో సాన్నిహిత్యంగా ఉంటున్నారు. అయితే బీజేపీలో చేరితే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఎసరువస్తుంది. టీఆర్ఎస్ అనర్హత వేటు వేస్తుంది. అందుకే అటు బీజేపీకి పనిచేస్తూనే ఇటు రాజ్యసభ సీటును వదలకూడదని భావించి డీఎస్ ఢిల్లీలో టీఆర్ఎస్ సభ్యుడిగానే ఉంటూ బీజేపీ తరుఫున పనిచేస్తున్నారు.

ఎంతో మందిని కారణం లేకుండా.. పొగ రాకుండానే సాగనంపిన కేసీఆర్ టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉండి వ్యతిరేకంగా పనిచేస్తున్న డీఎస్ విషయంలో మాత్రం నిస్సహాయంగా ఉండిపోవడం అందరిలోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది. తాటిని తన్నేవాడుంటే.. వాడి తలదన్నేవాడుంటాడు అన్న సామెతను సీనియర్ డీ శ్రీనివాస్ నిజం చేస్తున్నారని చెప్పకతప్పదు.

డీ శ్రీనివాస్ కుటుంబం మూడు పార్టీల్లో ఉండడంపై పెద్ద చర్చ జరుగుతున్న వేళ ఆయన బయటకొచ్చి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘తాను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియదు. నా ఇద్దరు కొడుకులు తనకు రెండుకళ్లు’ అని డీఎస్ తెలిపారు. తన కొడుకులు ఏ పార్టీలో ఉన్నా సమాజ సేవలో ఉండాలనే కోరుకుంటానని డీఎస్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు కూర్చుండి చక్రం తిప్పగలిగిన సత్తాను తనకు దేవుడు ఇచ్చాడని డీఎస్ అన్నారు.

ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో తాను చక్రం తిప్పానని.. ఆ చాకచక్యం తనకు దేవుడు ఇచ్చాడని డీఎస్ అన్నారు. నా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో త్వరలో మీరే చూస్తారు అంటూ ధర్మపురి విలేకరులతో అన్నారు.