Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్​ ముందు ఎవరికి? వారియర్స్​కు అక్కర్లేదా?

By:  Tupaki Desk   |   10 Dec 2020 11:28 AM IST
వ్యాక్సిన్​  ముందు ఎవరికి? వారియర్స్​కు అక్కర్లేదా?
X
కరోనా వ్యాక్సిన్​ ముందుగా వారియర్స్​కే (వైద్యులు, ఆరోగ్యసిబ్బంది) ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ భావించింది. అయితే ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశప్రజలందరికీ వ్యాక్సిన్​ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇప్పటికే ఐసీఎంఆర్​ స్పష్టం చేసింది. ముందుగా కరోనా వారియర్స్​కే ఇస్తారని అంతా భావించారు. కానీ ఇప్పటికే కరోనా వచ్చి తగ్గిపోయినవారికి వ్యాక్సిన్​ ఇవ్వొద్దని కొందరు నిపుణులు అంటున్నారు. వారిలో ఇప్పటికే యాంటీబాడీలు అభివృద్ధి చెంది ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్​ ఇస్తే దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ విషయంపై నిమ్స్‌ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) విభాగం అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్‌ మధుమోహన్‌రావు మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్​ ఒక్కోవ్యక్తికి ఒక్కోరకంగా పనిచేస్తుంది. శరీర తీరును బట్టి వ్యాక్సిన్​ పనితీరు ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఒక్కో రకమైన జన్యుపదార్థం ఉంటుంది. వైరస్​ మన జన్యుపదార్థం ఇంటరాక్ట్​ అయ్యే విధానాన్ని బట్టి వ్యాక్సిన్​ పనితీరు ఆధారపడి ఉంటుంది. మనుషుల్లో ఉండే హెచ్‌ఎల్‌ఏ (హ్యూమన్‌ ల్యూకోసైట్‌ యాంటిజెన్‌) జన్యువులు వైరస్‌తో అతుక్కునే విధానమే వ్యత్యాసాలకు కారణం. నిజానికి వ్యాక్సిన్​ అందరికీ అవసరం లేదు. రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవాళ్లకే వ్యాక్సిన్​ వెయ్యాలి. వృద్ధులు, స్టెరాయిడ్స్​ వాడే వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్​ అవసరం. ఒకసారి కరోనా వచ్చి తగ్గినవాళ్లకు వ్యాక్సిన్​ అవసరం లేదు. ఎందుకంటే వారి శరీరంలో అప్పటికే యాంటీబాడీస్​ ఉంటాయి.


వైరస్‌ వచ్చి తగ్గిన వారు కరోనా వ్యాక్సిన్‌ వేసుకుంటే కొన్నిసార్లు సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉంది.యాంటీబాడీ డిపెండెంట్‌ సెల్యులార్‌ సైటోటాక్సిసిటీ (ఏడీసీసీ) వచ్చే ప్రమాదం ఉంది. ఏడీసీసీల వల్ల మన కణాలు మన శరీరంపైనే దాడి చేస్తాయి. ఫలితంగా ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అయి కణాలు విచ్ఛిన్నం అవుతాయి. అలాగే కరోనా సోకి నయం అయిన వారిపై వ్యాక్సిన్‌ ప్రభావంపై పరిశోధనలు కూడా చాలా తక్కువగా జరిగాయి. 17 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్​ అవసరం లేదు.’ అని మధుమోహన్​రావు తెలిపారు.